అన్నీ ఓపెన్‌

ABN , First Publish Date - 2020-05-18T07:33:38+05:30 IST

సెలూన్లు తెరుచుకోనున్నాయి. క్యాబ్‌లు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. ఈ-కామర్స్‌ మొదలు కానుంది. అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులకూ గ్రీన్‌ సిగ్నల్‌! ఫుడ్‌ హోం డెలివరీ చేయడానికీ అనుమతి.. ఇలా ఒకటేమిటి దాదాపు రెండు నెలలుగా...

అన్నీ ఓపెన్‌

  • నెలాఖరు వరకు లాక్‌డౌన్‌
  • భారీ సడలింపులు
  • కొన్ని మినహా మొత్తం వ్యాపారాలకు అనుమతి
  • అంతర్రాష్ట్ర బస్‌ సర్వీసులకు పచ్చజెండా
  • ఆయా రాష్ట్రాల అంగీకారం తప్పనిసరి
  • సెలూన్లు, క్యాబ్‌లు, ఈ- కామర్స్‌కు ఓకే
  • రెస్టారెంట్లు హోం డెలివరీ చేయవచ్చు
  • సడలింపులపై నిర్ణయం రాష్ట్రాలదే
  • విమానాలు, మెట్రో రైళ్లపై నిషేధం
  • సినిమాహాళ్లు, షాపింగ్‌ మాల్స్‌ క్లోజ్‌
  • మత కార్యక్రమాలకు అనుమతి లేదు
  • రాజకీయ, క్రీడా, వినోదాలకూ నో
  • జోన్ల నిర్ణయాధికారం రాష్ట్రాలదే
  • కేంద్రం మార్గదర్శకాలు విడుదల


సెలూన్లు తెరుచుకోనున్నాయి. క్యాబ్‌లు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. ఈ-కామర్స్‌ మొదలు కానుంది. అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులకూ గ్రీన్‌ సిగ్నల్‌! ఫుడ్‌ హోం డెలివరీ చేయడానికీ అనుమతి.. ఇలా ఒకటేమిటి దాదాపు రెండు నెలలుగా నిలిచిపోయిన పలు సేవలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చేసింది. అయితే, ఈ సడలింపులను అమలు చేయాలా వద్దా అన్న నిర్ణయాధికారాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది.


న్యూఢిల్లీ, మే17(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ కాలపరిమితిని కేంద్రప్రభుత్వం మళ్లీ ఈ నెల 31వరకు పొడిగించింది. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ(ఎన్‌డీఎంఏ) ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌ 3.0 ముగిసిన నేపథ్యంలో కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ 4.0ను ప్రకటించడం గమనార్హం. నాలుగోదశ లాక్‌డౌన్‌ 31దాకా అమలు చేయాలని నిర్ణయించినట్లు ఎన్‌డీఎంఏ జారీచేసిన ఉత్తర్వులో పేర్కొంది.


లాక్‌డౌన్‌ పొడిగింపు ఉంటుందని ప్రధాని ఇటీవల సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ వల్ల చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను మళ్లీ బలోపేతం చేసేందుకు కొన్ని షరతులతో కార్యకలాపాలను కొనసాగించేందుకు కేంద్రం సమ్మతించింది. రెడ్‌ జోన్‌లో కఠినంగా వ్యవహరిస్తూనే... గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సడలింపులు ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబ అధ్యక్షతన సంబంధిత హోం, ఆరోగ్యశాఖల కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం నాలుగో విడత లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను ఉపయోగించడం వంటి వాటిని కచ్చితంగా అందరూ పాటించాలని పేర్కొంది.


వీటిపై ఆంక్షలు

  1. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి నిషిద్ధం. అయితే కేంద్రం అనుమతితో దేశీయ ఎయిర్‌ అంబులెన్స్‌లకు, భద్రతకు సంబంధించిన విమానాలకు ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది
  2. ఈ నెల 31వరకు రైలు, మెట్రో ప్రజా ప్రయాణ సేవలపై నిషేధం పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లు నాలుగో విడత లాక్‌డౌన్‌ ముగిసే వరకు మూతబడే ఉంటాయి. అయితే, ఆన్‌లైన్‌ క్లాసులను అనుమతిస్తారు. 
  3. హోటళ్లు, రెస్టారెంట్లు తెరవడం నిషిద్ధం.
  4. సినిమాహాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, జిమ్‌ సెంటర్లపై నిషేధం కొనసాగింపు
  5. స్విమ్మింగ్‌ పూల్స్‌, బార్లు, ఆడిటోరియాలు, ఆసెంబ్లీ హాళ్లు తెరవకూడదు.
  6. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోదాలకు సంబంధించిన అన్ని వేడుకలపైనా నిషేధమే.
  7. మత పరమైన సంస్థల్లో ప్రజలకు అనుమతి ఉండదు. మత సంబంధమైన కార్యక్రమాలు కూడ నిషేధమే.
  8. ప్రతి రోజూ రాత్రి 7గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది.
  9. 65 ఏళ్లకు పైబడిన వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడేవారు, పదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు.. అత్యవసర, వైద్య సాయం కోసం తప్ప బయటకు రాకూడదు.


వీటికి అనుమతి

  1. కట్టడి ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల నిషేధించిన జాబితాలో లేని షాపులను తెరుచుకోవచ్చు. అయితే, వీటిని నిర్ణీత సమయంలో మాత్రమే తెరవాల్సి ఉంటుంది. అంతేకాకుండా షాపులో ఒకేసారి ఐదుగురికి మించి కొనుగోలుదారులు ఉండరాదు. ప్రతి ఇద్దరి కొనుగోలు దారుల మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలి.
  2. సెలూన్లు, స్పాలు,బ్యూటీపార్లర్లకు అనుమతి
  3. కట్టడి ప్రాంతాలు మినహా అంతర్రాష్ట్ర ప్రయాణ వాహనాలకు అనుమతి. అయితే, ఆయా రాష్ర్టాల మధ్య పరస్పర అంగీకారం ఉండాలి.
  4. ఆన్‌లైన్‌ వాణిజ్యానికి(ఈ కామర్స్‌) అనుమతి. నిత్యావసరాలే కాకుండా అన్ని రకాల వస్తువులకు అనుమతి.
  5. సరుకు రవాణా వాహనాలకు పూర్తిస్థాయి అనుమతి. కట్టడి ప్రాంతాల్లో మాత్రం ఈ కామర్స్‌ను అనుమతించరు.
  6. జోన్‌తో సంబంధం లేకుండా క్యాబ్‌ సర్వీసులకు అనుమతి. డ్రైవర్‌ కాకుండా ఇద్దరు ప్రయాణించవచ్చు. అయితే పూలింగ్‌పై మాత్రం నిషేధం కొనసాగుతుంది. అయా రాష్ట్రాలకు అభ్యంతరం లేకపోతే అంతర్రాష్ట్ర సర్వీసులకు కూడా అనుమతి.
  7. దేశీయంగా వైద్య సేవలకు అనుమతి..
  8. రెస్టారెంట్లకు హోండెలివరికే అనుమతి.
  9. క్రీడా కేంద్రాలు, స్టేడియాలను తెరిచేందుకు అనుమతి. అయితే, ప్రేక్షకులను మాత్రం అనుమతించరు.
  10. మెడికల్‌, వైద్య, పారిశుధ్య విభాగాలకు చెందిన వారు అంతర్‌ రాష్ట్ర ప్రయాణం చేసేందుకు అనుమతి.
  11. గరిష్ఠంగా 50మంది అతిథులతో వివాహాలకు అనుమతి.
  12. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు హాజరయ్యేవారి సంఖ్య 20కి మించరాదు.
  13. రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లలో క్యాంటీన్లకు అనుమతి.
  14. వైద్య, పోలీస్‌, ప్రభుత్వ ఉద్యోగులు, హెల్త్‌కేర్‌ వర్కర్లకు సేవలందించేవారితోపాటు, క్వారంటైన్‌లో ఉన్నవారికి ఆహారం అందించే హోటళ్లకు అనుమతి.


కట్టడి ప్రాంతాల్లో కట్టుదిట్టం

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలకు లోబడి రెడ్‌, ఆరెంజ్‌, కంటైన్మెంట్‌, బఫర్‌ జోన్ల సరిహద్దులను ఆయా జిల్లా అధికారులే నిర్ణయిస్తారు. అలాగే రెడ్‌, ఆరెంజ్‌, కంటైన్మెంట్‌, బఫర్‌ జోన్ల సరిహద్దులు ఆ జిల్లా అధికారులే నిర్ణయిస్తారు. కంటైన్మెంట్‌ జోన్లలో ప్రతి ఇంటిపై నిఘా పెట్టాలి. అవసరమైన సమయాల్లో అక్కడున్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించాలి. కంటైన్‌మెంట్‌ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర కార్యక్రమాలేవీ నిర్వహించకూడదు. ప్రజలు రోడ్లమీద తిరగకూడదు.


Updated Date - 2020-05-18T07:33:38+05:30 IST