కరోనా రోగుల వివరాలివ్వండి.. ఆస్పత్రులకు ఆదేశాలు..

ABN , First Publish Date - 2020-04-25T22:21:51+05:30 IST

కొవిడ్-19పై పరిశోధనల కోసం గుర్తింపు పొందిన సంస్థలు, రీసెర్చర్లకు కరోనా రోగుల వివరాలు, వారి నమూనాలను ఇవ్వాలంటూ...

కరోనా రోగుల వివరాలివ్వండి.. ఆస్పత్రులకు ఆదేశాలు..

న్యూఢిల్లీ: కొవిడ్-19పై పరిశోధనల కోసం గుర్తింపు పొందిన సంస్థలు, రీసెర్చర్లకు కరోనా రోగుల వివరాలు, వారి నమూనాలను ఇవ్వాలంటూ దేశంలోని అన్ని ఆస్పత్రులకు కోవిడ్-19పై ఏర్పాటైన సాధికార బృందం ఆదేశాలు జారీ చేసింది. వివరాలు కోరుతూ దరఖాస్తు వచ్చిన ఐదు రోజుల్లోగా ఆస్పత్రులు తమవద్ద ఉన్న డేటాను పంచుకోవాలని సూచించింది. నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ సారథ్యంలో ‘మెడికల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్లాన్’‌పై ఏర్పాటైన ఈ సాధికార బృందం... కొవిడ్‌-19 పరిశోధనల కోసం పంచుకోవాల్సిన వివరాలు, నమూనాలపై మార్గదర్శకాలు సైతం ఖరారు చేసింది.


ఈ మార్గదర్శకాల ప్రకారం... దరఖాస్తు వచ్చిన తర్వాత గడువులోగా వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. కరోనా రోగులు, వారి నమూనాల కోసం దరఖాస్తు వచ్చిన తర్వాత ఐదు రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటారు. కొవిడ్-19పై పోరాటంలో భాగంగా.. దీనిపై పరిశోధనల కోసం పూర్తి పర్యావరణ అనుకూలమైన వ్యవస్థను అందించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని సాధికార బృందం పేర్కొంది. శాస్త్ర, సాంకేతిక పరంగా కొవిడ్-19 మహమ్మారిపై పురోగతి సాధించాలంటే దానికి సంబంధించిన డేటా, నమూనాలు చాలా అవసరమని పేర్కొంది. ఔషధ పరిశోధనలు ముందుకు సాగాలన్నా వీటి అవసరం ఎంతో ఉందని తెలిపింది.  

Updated Date - 2020-04-25T22:21:51+05:30 IST