ఆక్సిజన్ నేరుగా ఇంటికే : కేజ్రీవాల్
ABN , First Publish Date - 2020-06-22T21:14:47+05:30 IST
కోవిడ్ పేషెంట్లకు ఎలాంటి సమస్యా లేకుండా అవసరమైన వైద్య పరీక్షలు అందుబాటులోకి తెచ్చామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ..

న్యూఢిల్లీ: కోవిడ్ పేషెంట్లకు ఎలాంటి సమస్యా లేకుండా అవసరమైన వైద్య పరీక్షలు అందుబాటులోకి తెచ్చామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. హోం క్వారంటైన్ కేసుల విషయంలో నేరుగా ఆక్సిజన్ మీటర్లు అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఇందువల్ల పేషెంట్లు తమ ఆక్సిజన్ రేటును పరిశీలించుకునే వీలుంటుందని చెప్పారు.
'కరోనా వైరస్ బారిన పడిన వారు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం గమనించాం. కోవిడ్ పాజిటివ్తో హోం క్వారంటైన్లో ఉన్న ప్రతి ఇంటికి ఆక్సిజన్ మీటర్ అందజేయాలని మేము నిర్ణయించాం. ప్రతి జిల్లాలోనూ ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్ ఏర్పాటు చేస్తాం. ఎవరికైనా శ్వాస ఇబ్బంది ఉండి, అక్సిజన్ అవసరమైతే ఇంట్లోనే ఆక్సిజన్ సపోర్ట్ కల్పించేందుకు వీలుగా హెల్ప్ లైన్ నెంబర్ కూడా అందుబాటులోకి తెస్తున్నాం' అని కేజ్రీవాల్ తెలిపారు.
కోవిడ్ పరీక్షలను మూడురెట్లు పెంచామని, ఇంతకుముందు రోజుకు ఐదువేల టెస్టులు చేసేవారమని, ఇవాళ రోజుకు 18 వేల టెస్టులు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఢిల్లీలో 25,000 యాక్టివ్ కేసులు ఉండగా, 33,000 మందికి స్వస్థత చేకూరిందని, 6,000 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుంటే, 12,000 మంది ఇళ్లలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో యాంటిజెన్ పరీక్షలు కూడా చేస్తున్నామని, ఇందువల్ల 15 నుంచి 30 నిమిషాల్లో ఫలితాలు వస్తున్నాయని కేజ్రీవాల్ చెప్పారు.