పశ్చిమ బెంగాల్లో మందు బాబుల ఇళ్ళకే మద్యం
ABN , First Publish Date - 2020-04-09T00:20:01+05:30 IST
ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం
కోల్కతా : ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం అమలవుతున్న నేపథ్యంలో మద్యపాన ప్రియుల ఇళ్లకే మద్యాన్ని అందజేయడాన్ని అనుమతించాలని నిర్ణయించింది.
రాష్ట్ర ఎక్సయిజ్ డైరెక్టరేట్కు చెందిన విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం అష్ట దిగ్బంధనం సమయంలో మద్యం అమ్మకాలపై నిషేధం లేదు. అయినప్పటికీ అష్ట దిగ్బంధనం అమలవుతున్నందువల్ల చాలా మద్యం దుకాణాలను మూసివేస్తున్నారు. ఇకపై మద్యపాన ప్రియుల ఇళ్ళకే మద్యాన్ని అందజేస్తారు.
మద్యాన్ని రిటెయిల్గా అమ్మేవారికి కోల్కతా పోలీసులు డెలివరీ పాస్లను జారీ చేస్తారు. మద్యం దుకాణాల యజమానులు ఈ పాసులను తమ సమీప పోలీస్ స్టేషన్ నుంచి తీసుకోవచ్చు. ఒక్కొక్క మద్యం దుకాణానికి మూడు డెలివరీ పాస్ల చొప్పున మాత్రమే ఇస్తారు.
మద్యం కావాలనుకునేవారు ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫోన్ ద్వారా తమ సమీపంలోని మద్యం దుకాణానికి ఆర్డర్ చేయవచ్చు. అనంతరం రిటెయిలర్లు తమకు వచ్చిన ఆర్డర్ల ప్రకారం మద్యాన్ని అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్ళకే అందజేస్తారు.