పార్టీ పెట్టను: రజినీ
ABN , First Publish Date - 2020-12-30T08:10:15+05:30 IST
రాజకీయ అరంగేట్రంపై తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ యూటర్న్ తీసుకున్నారు. ఈ నెల 31న ప్రారంభించదలచిన ‘రజినీ మక్కల్ మండ్రం’ పార్టీ నిర్ణయాన్ని
ప్రకటనకు ముందు ఆస్పత్రిలో చేరడం దేవుడు చేసిన హెచ్చరిక
తమిళనాడు ప్రజలకు 3 పేజీల లేఖ
అభిమానులు, ప్రజలకు క్షమాపణలు
రాజకీయాల్లోకి రాకున్నా ప్రజాసేవ
చెన్నై, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాజకీయ అరంగేట్రంపై తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ యూటర్న్ తీసుకున్నారు. ఈ నెల 31న ప్రారంభించదలచిన ‘రజినీ మక్కల్ మండ్రం’ పార్టీ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో నిరాశ చెందే అభిమానులు, ప్రజలు తనను క్షమించాలని కోరారు. ఈ మేరకు రజినీ తమిళనాడు ప్రజలను ఉద్దేశించి మంగళవారం మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. పార్టీ ప్రకటన తేదీకి ముందు అనారోగ్యం పాలవడం దేవుడు చేసిన హెచ్చరికగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని ప్రకటించి, వైద్యుల సూచనలను సైతం కాదని ‘అన్నాత్తే’ షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లాను. ప్రతిరోజూ కరోనా పరీక్షలు చేయించుకుంటూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అయినా నలుగురికి పాజిటివ్ వచ్చింది.
నాకు కరోనా నెగెటివ్ వచ్చింది. కానీ, రక్తపోటు అధికమైంది. ఇప్పటికే కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్నందున వైద్యుల సూచన మేరకు 3 రోజుల పాటు హైదరాబాద్ ఆసుపత్రిలో ఉన్నాను. నా ఆరోగ్య పరిస్థితిని చూసి ప్రొడ్యూసర్ కళానిధిమారన్ షూటింగ్ను వాయిదా వేశారు. ఫలితంగా అనేకమందికి జీవనోపాధి పోయింది. రూ.కోట్ల నష్టం వాటిల్లింది. వీటన్నింటికీ కారణం నా ఆరోగ్య పరిస్థితే. ఇది దేవుడు నాకు చేసిన హెచ్చరికగా భావిస్తున్నా. రాజకీయ ప్రవేశం చేశాక సమావేశాలు నిర్వహించి, ప్రచారంలో భాగంగా లక్షల మందిని కలవాల్సి వస్తుంది. ఇప్పుడు కరోనా కొత్తరూపం సంతరించుకుంది. అలాంటప్పు డు ప్రజలను నేరుగా కలుసుకుని ప్రచారం చేస్తే నాకు, దానివల్ల ప్రజలకు వైరస్ వ్యాపించొచ్చు. అలాంటి పరిస్థితి రాకూడదని భావిస్తున్నా’’ అన్నారు. ‘‘నా నిర్ణయం అభిమానులకు, ప్రజలకు నిరాశ కలిగిస్తుందని తెలుసు. నన్ను క్షమించండి. నా మాట కు కట్టుబడి రజినీ మక్కల్ మండ్రం వారు మూడేళ్లుగా ప్రజలకు సేవ చేశా రు. నవంబరు 30న నేను మిమ్మ ల్ని కలుసుకున్నప్పుడు మీరంతా ఒకే మాటగా ‘మీ ఆరోగ్యమే మాకుముఖ్యం. మీరు ఏ నిర్ణ యం తీసుకున్నా మాకు సమ్మతమే’ అని చెప్పిన మాటలు మర్చిపోలేను. ‘రజనీ మక్కల్ మండ్రం’ ఎప్పటిలాగే కొనసాగుతుంది’’ అని రజినీ పేర్కొన్నారు.