భారత విదేశాంగ విధానం విఫలమైందా..?: ‘మహా’ మంత్రి

ABN , First Publish Date - 2020-06-19T00:08:30+05:30 IST

లద్దాక్‌లో చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన..

భారత విదేశాంగ విధానం విఫలమైందా..?: ‘మహా’ మంత్రి

ముంబై: లద్దాక్‌లో చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత జితేంద్ర ఆహ్వాద్ కేంద్రంపై పలు ప్రశ్నలు సంధించారు. చైనా దురాక్రమణకు పాల్పడినట్టు స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ.. గాల్వాన్ లోయలో నెలకొన్న ప్రతిష్టంభనపై ఒక్కదేశం కూడా నోరెత్తకపోవడానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. భారత అంతర్జాతీయ విధానం ‘‘విఫలంకావడం’’ వల్లే ఇలా జరిగినట్టు కనిపిస్తోందనీ.. అమెరికా విధానం కూడా భారత్‌కు అనుకూలంగా ఉన్నట్టు అనిపించడంలేదని ఆహ్వాద్ అన్నారు.


‘‘ఇప్పుడు గాల్వాన్ లోయ తమ దేశంలో అంతర్భాగం అని చైనా అంటోంది. తర్వాత లద్దాక్ కూడా తమదేనని అంటుంది. చైనా దురాక్రణను వ్యతిరేకిస్తూ భారతీయులంతా ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. భారత ఆర్మీకి ప్రజలు అన్ని విధాలా మద్దతుగా నిలబడాలి...’’ అని ఆహ్వాద్ ట్వీట్ చేశారు. కాగా చైనా సంస్థలకు కట్టబెట్టిన ఢిల్లీ-మీరట్ మెట్రో పనుల కాంట్రాక్టును కేంద్రం రద్దు చేయాలంటూ ఇటీవల ఆయన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-06-19T00:08:30+05:30 IST