రైతులకు మద్దతుగా బెనివాల్ సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2020-12-20T04:01:07+05:30 IST

రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) చీఫ్, ఎంపీ హనుమాన్ బెనివాల్ సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు....

రైతులకు మద్దతుగా బెనివాల్ సంచలన నిర్ణయం

జైపూర్: రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) చీఫ్, ఎంపీ హనుమాన్ బెనివాల్ సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. తాను సభ్యుడిగా ఉన్న మొత్తం మూడు పార్లమెంటరీ ప్యానెళ్లకు రాజీనామా చేస్తున్నట్టు ఆయన శనివారం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల ఆందోళనకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో బెనివాల్ పార్టీ ఆర్‌ఎల్పీ కూడా మిత్రపక్షంగా ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో పార్లమెంటరీ ప్యానెళ్ల నుంచి తప్పుకుంటూ లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు ఆయన తన రాజీనామా లేఖను పంపారు.


‘‘పార్లమెంటులో నేను సభ్యుడిగా ఉన్న అన్ని ప్యానెళ్లలోనూ వివిధ ప్రజా సమస్యలపై గళం వినిపించాను. అయితే ఆయా సమస్యలపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. తగిన చర్యలు తీసుకోనప్పుడు పార్లమెంటరీ వ్యవస్థలో కమిటీలు ఉండి కూడా ఉపయోగం లేదు..’’ అని బెనివాల్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తాను లేవనెత్తిన సమస్యలు అపరిష్కృతంగా ఉండడంతో పాటు.. రైతుల ఆందోళన నేపథ్యంలో ఈ కమిటీలకు తాను రాజీనామా చేస్తున్నానంటూ ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలు, పెట్రోలియం, సహజ వాయువులు సహా మొత్తం మూడు పార్లమెంటరీ కమిటీల్లో బెనివాల్ సభ్యుడిగా కొనసాగారు. 

Updated Date - 2020-12-20T04:01:07+05:30 IST