చెక్బౌన్స్ కేసులో బీజేపీ నేతకు రెండేళ్ల జైలు, రూ.3 కోట్ల జరిమానా!
ABN , First Publish Date - 2020-10-04T01:16:08+05:30 IST
ఓ చెక్బౌన్స్ కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎంపీ దేవ్జీ ఫాతేఫరాకి రెండేళ్ల జైలు శిక్ష...

అహ్మదాబాద్: ఓ చెక్బౌన్స్ కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎంపీ దేవ్జీ ఫాతేఫరాకి రెండేళ్ల జైలు శిక్ష, రూ.2.97 కోట్ల జరిమానా విధిస్తూ గుజరాత్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రూ.2.97 జరిమానా చెల్లించని పక్షంలో ఫాతేఫరా అదనంగా మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కలోల్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి డీఎస్ ఠాగూర్ తీర్పు చెప్పారు. జరిమానా మొత్తాన్ని ఫిర్యాదుదారు ప్రభాసిన్హ ఠాగూర్కు చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. 2018లో ఓ భూమి కొనుగోలుకు సంబంధించి ఠాగూర్ వద్ద తీసుకున్న రూ. 1,48,50,00కి ఫాతేపరా చెక్ రాసిచ్చారు. అయితే ఆ చెక్కు చెల్లకపోవడం, ఫాతేపరా ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో... ఠాగూర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఫాతేపరా గుజరాత్లోని సురేంద్ర నగర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు.