అష్ట దిగ్బంధనం సమయంలో రైతులకు పెద్ద పీట వేయాలి : ఉప రాష్ట్రపతి
ABN , First Publish Date - 2020-04-16T02:47:25+05:30 IST
పోరాటంలో భాగంగా అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం
![అష్ట దిగ్బంధనం సమయంలో రైతులకు పెద్ద పీట వేయాలి : ఉప రాష్ట్రపతి](https://media.andhrajyothy.com/appimg/galleries/2020041509160012/04152020211609n88.gif)
న్యూఢిల్లీ : కోవిడ్-19పై పోరాటంలో భాగంగా అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం సమయంలో రైతులకు, వ్యవసాయానికి పెద్ద పీట వేయాలని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వ్యవసాయ కార్యకలాపాలు సజావుగా జరగడానికి, వ్యవసాయోత్పత్తుల రవాణా సజావుగా జరగడానికి తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.
వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అష్ట దిగ్బంధనం సమయంలో రైతులకు, వ్యవసాయానికి పెద్ద పీట వేయాలని చెప్పారు. వ్యవసాయ కార్యకలాపాలు, వ్యవసాయోత్పత్తుల రవాణా సజావుగా జరగడానికి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
వ్యవసాయ రంగాన్ని కాపాడటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించారు. రైతులు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తిదారులు సంఘటిత రంగంలో లేరని, అందువల్ల వారి అభిప్రాయాలను వినేవారు ఉండటం లేదని చెప్పారు. అందువల్ల ప్రభుత్వమే వారి ప్రయోజనాలను కాపాడాలన్నారు.
ఇది రాష్ట్రాల కర్తవ్యం అయినప్పటికీ, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్గదర్శకత్వం చేయాలని తెలిపారు.
21 రోజుల దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం ఏప్రిల్ 14తో ముగియవలసి ఉంది. కానీ దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో అష్ట దిగ్బంధనాన్ని మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు.