లాక్డౌన్ ముగిసినా వారికి మాత్రం ఆ సర్టిఫికెట్లు ఉండాల్సిందే: మంత్రి
ABN , First Publish Date - 2020-04-14T23:12:58+05:30 IST
కరోనా వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం విధించిన లాక్డౌన్ను ఎత్తివేసినప్పటికీ గోవా వచ్చే పర్యాటకులకు మాత్రం
![లాక్డౌన్ ముగిసినా వారికి మాత్రం ఆ సర్టిఫికెట్లు ఉండాల్సిందే: మంత్రి](https://media.andhrajyothy.com/appimg/galleries/2020041405370649/04142020174134n5.jpg)
పనాజీ: కరోనా వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం విధించిన లాక్డౌన్ను ఎత్తివేసినప్పటికీ గోవా వచ్చే పర్యాటకులకు మాత్రం హెల్త్ సర్టిఫికెట్ తప్పనిసరని గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణె మంగళవారం పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి, కోవిడ్-19 సర్టిఫికెట్ లేని ప్రయాణికులను రాష్ట్రంలోకి అనుమతించవద్దని కోరాల్సిందిగా సీఎం ప్రమోద్ సావంత్ను కోరినట్టు రాణె తెలిపారు.
కోవిడ్-19కు అడ్డుకట్ట వేసేందుకు నిబంధనలు విధించే సొంత అధికారం అన్ని రాష్ట్రాలకు ఉంటుందన్నారు. రాష్ట్రంలో కరోనా రోగులందరూ కోలుకున్నా, అధికారులు మాత్రం విశ్రాంతి తీసుకోబోరని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ పరీక్షా కేంద్రాలను తాలూకాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కానప్పటికీ అప్రమత్తంగానే ఉన్నామని రాణె తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదు కాగా, రెండు యాక్టివ్గా ఉన్నాయి. ఐదుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.