టీ స్టాల్స్, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతించాలంటున్న గోవా మంత్రి
ABN , First Publish Date - 2020-05-14T02:09:57+05:30 IST
గోవా ప్రభుత్వం స్థానిక ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం గురించి ఆలోచిస్తోంది.

పనజీ : గోవా ప్రభుత్వం స్థానిక ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం గురించి ఆలోచిస్తోంది. నాలుగో విడత దేశవ్యాప్త అష్ట దిగ్బంధనంలో కొన్ని సడలింపులు లభిస్తాయని ఆశిస్తోంది. టీ స్టాల్స్, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతించే అవకాశం ఉందని భావిస్తోంది. కోవిడ్-19 మహమ్మారిపై యుద్ధంలో భాగంగా అమలవుతున్న దేశవ్యాప్త అష్ట దిగ్బంధనంలో టీ స్టాల్స్, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతించాలని కోరుతోంది.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం పోర్టులు, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి మైఖేల్ లోబో మాట్లాడుతూ టీ స్టాల్స్, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతించాలని తాను కోరినట్లు తెలిపారు. టేబుల్స్ మధ్య తగినంత దూరం పాటిస్తూ వీటిని తెరిచినట్లయితే, ఈ వ్యాపారాలు పునరుజ్జీవం పొందుతాయన్నారు.
‘‘నేడు ఇబ్బందుల్లో ఉన్న చిన్న వ్యాపారులు, అంటే, టీ స్టాల్స్, రెస్టారెంట్లు, వీథుల్లో తిరిగి ఆహార పదార్థాలను అమ్ముకునేవారు, తమ వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతించాలని కోరాను. భౌతిక దూరం పాటిస్తూ, హాండ్ శానిటైజర్లను వాడుతూ వ్యాపారాలు చేసుకోవడానికి చిన్న వ్యాపారులను అనుమతించాలని కోరాను’’ అని లోబో చెప్పారు.