శ్మశానంలో సగం కాలిన కరోనా మృత దేహం.. బంధువులకు నరకం..!
ABN , First Publish Date - 2020-06-18T16:09:07+05:30 IST
శ్మశానంలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియల్లో తీవ్ర ఆటంకం ఎదురైంది. సగం కాలిన మృత దేహంతో బంధువులు నరకం అనుభవించారు.
ఘాజియాబాద్: శ్మశానంలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియల్లో తీవ్ర ఆటంకం ఎదురైంది. సగం కాలిన మృత దేహంతో బంధువులు నరకం అనుభవించారు. పరిస్థితి చక్కబడేందుకు వారు ఏకంగా 29 గంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ భయానక ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో సోమవారం జరిగింది. మృతదేహాన్ని విద్యుత్ క్రిమెటోరియంలో దహనం చేస్తుండగా ఉన్నట్టుంది కరెంటు పోయింది. దీంతో అక్కడ ఒక్కసారిగా గగ్గోలు పుట్టింది. మృత దేహం పూర్గిగా దహనం కాలేదని తెలిసి బంధువులు తీవ్ర ఆవేదన చెందారు. ఇక సమస్యను పరిష్కరించేందుకు దాదాపు 29 గంటలు పట్టడంతో వారి ఆక్రోశానికి అంతే లేకుండా పోయింది. అంత్యక్రియలు పూర్తయ్యాక ఎంగిలి పడాలన్న నియమం ఉండటంతో తాము ఆకలితో అలమటించిపోయామని, మృత దేహాం పూర్తిగా దహనం కాలేదని తెలిసి తమ గుండె తరక్కుపోయిందని బంధువులు స్థానిక మీడియాతో తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. బుధవారం నాటికి విద్యుత్ సమస్య పరిష్కారమవడంతో బుంధువులు అంత్యక్రియలు పూర్తి చేశారు.