‘గేట్‌’ నగర మార్పునకు నేడే తుది గడువు

ABN , First Publish Date - 2020-12-15T13:03:27+05:30 IST

‘గేట్‌’ నగర మార్పునకు నేడే తుది గడువు

‘గేట్‌’ నగర మార్పునకు నేడే తుది గడువు

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది గేట్‌ పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులు తాము పరీక్ష రాసే నగరాన్ని మార్చుకునేందుకు ఆఖరి అవకాశాన్ని గేట్‌ కమిటీ కల్పించింది. ఈ మేరకు ‘గోప్స్‌’ పోర్టల్‌ను తిరిగి తెరచినట్లు ప్రకటించింది. నగరాన్ని మార్చుకునేందుకు అభ్యర్థులకు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమకు అనువైన నగరాన్ని ఎంచుకోవచ్చని ఆ ప్రకటనలో తెలిపింది. ‘‘నగరాన్ని మార్చుకోవడంపై పలు విజ్ఞప్తులు గేట్‌-2021 కమిటీకి వచ్చాయి. మరోసారి అవకాశాన్ని కల్పించాలని చాలామంది అభ్యర్థులు కోరారు. కరోనా నేపథ్యంలో భారీ సంఖ్యలో వచ్చిన విజ్ఞప్తుల్ని దృష్టిలో పెట్టుకుని గోప్స్‌ పోర్టల్‌ను తిరిగి తెరవాలని నిర్ణయించాం’’ అని కమిటీ పేర్కొంది. సోమవారం తెరచిన ఈ పోర్టల్‌, మంగళవారం వరకూ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఇక ఏ మార్పులనూ అంగీకరించేది లేదని కమిటీ స్పష్టం చేసింది. కాగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 7 వరకూ, 12 నుంచి 14 వరకూ మొత్తం 27 సబ్జెక్టులకు గేట్‌ పరీక్షను నిర్వహించనున్నారు. 8.82లక్షలమంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.

Updated Date - 2020-12-15T13:03:27+05:30 IST