ఆగస్టు 15 నుంచి జమ్మూ కశ్మీర్‌లో ప్రయోగాత్మకంగా 4జీ సేవలు

ABN , First Publish Date - 2020-08-11T21:16:51+05:30 IST

జమ్మూ కశ్మీర్‌లో 4జీ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించడానికి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని

ఆగస్టు 15 నుంచి జమ్మూ కశ్మీర్‌లో ప్రయోగాత్మకంగా 4జీ సేవలు

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లో 4జీ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించడానికి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు విన్నవించింది. 4జీ సేవలను తిరిగి పునరుద్ధరించే నిమిత్తమై ఏర్పాటైన ప్రత్యేక కమిటీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తోందని కేంద్రం పేర్కొంది. జమ్మూ కశ్మీర్ లోని ఓ జిల్లాతో పాటు కశ్మీర్‌లోని మరో జిల్లాలో అందిస్తామని తెలిపింది. ఈ సేవలు ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వస్తాయని సుప్రీంకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.


అయితే... కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంటర్నెట్ సేవలపై కేంద్రం ఓ కన్నేసి ఉంచుతుందని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉగ్రవాద కార్యకలాపాలు అధికంగా ఉండే జిల్లాలతో పాటు, సరిహద్దు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ ఉండదని ప్రకటించింది. ఈ విషయంపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ...


‘‘ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణపై స్థానిక ఏజెన్సీలతో ప్రత్యేక కమిటీ సమావేశమైంది. జమ్మూ కశ్మీర్ భద్రతను దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఇంకా పరిస్థితులు హానికరంగానే ఉన్నాయని కమిటీ పేర్కొంది. అయితే... ఇంటర్నెట్ ఆంక్షలు కోవిడ్‌ విషయంలో, విద్య, వ్యాపారాల విషయంలో ఎలాంటి ఆటంకాలు కలిగించడం లేదు’’ అని వేణుగోపాల్ తెలిపారు.

Updated Date - 2020-08-11T21:16:51+05:30 IST