ఏనుగుల మృతి కేసులో నలుగురు అటవీశాఖాధికారుల సస్పెన్షన్
ABN , First Publish Date - 2020-06-14T17:10:48+05:30 IST
చత్తీస్ఘడ్ అడవుల్లో మూడు ఏనుగులు మరణించిన ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనలో అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణమని నలుగురిని సస్పెండ్ చేసింది.....
రాయపూర్ (చత్తీస్ఘడ్): చత్తీస్ఘడ్ అడవుల్లో మూడు ఏనుగులు మరణించిన ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనలో అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణమని నలుగురిని సస్పెండ్ చేసింది. చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని సూరజ్పూర్ జిల్లా ప్రతాపూర్ అడవుల్లో మూడు ఆడ ఏనుగుల కళేబరాలు వెలుగుచూశాయి. ఇందులో ఓ ఏనుగు గర్భంతో ఉండి మరణించిందని పోస్టుమార్టంలో తేలింది. ప్రతాపూర్ అటవీ రేంజ్ లో మూడు చోట్ల మూడు ఆడ ఏనుగులు మరణించాయి.ఇద్దరు ఫారెస్ట్ రేంజర్లు, ఇద్దరు ఫారెస్టు గార్డులను సస్పెండ్ చేశామని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఖుటియా చెప్పారు.డీఎఫ్వో కు కూడా షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఏనుగుల మృతి ఘటనలపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించామని చత్తీస్ ఘడ్ అటవీశాఖ మంత్రి ముహ్మద్ అక్బర్ చెప్పారు. మరో రెండు ఏనుగుల కళేబరాల వద్ద ఏనుగుల మంద గుమిగూడి ఉండటంతో అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకోలేక పోయారు. గర్భం దాల్చిన ఏనుగు గుండెపోటుతో మరణించిందని పోస్టుమార్టంలో కనిపించిందని చత్తీస్ఘడ్ అటవీశాఖ అదనపు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అరుణ్ కుమార్ పాండే చెప్పారు. గత నెలరోజులుగా అడవుల్లో ఏనుగుల మంద సంచరిస్తుందని అధికారులు చెప్పారు. బొగ్గుగనులున్న ప్రాంత అడవుల్లో 240 ఏనుగులు ఉండగా, వీటిలో మూడు మరణించాయని అటవీ శాఖ అధికారులు చెప్పారు.