ఆకలి చావులతో చస్తాం... కానీ ఆందోళన విరమించం : రైతులు

ABN , First Publish Date - 2020-11-27T12:45:16+05:30 IST

రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు సరికదా... మరింత పట్టు బిగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఢిల్లీకి చేరుకుంటామని

ఆకలి చావులతో చస్తాం... కానీ ఆందోళన విరమించం : రైతులు

న్యూఢిల్లీ : రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు సరికదా... మరింత పట్టు బిగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఢిల్లీకి చేరుకుంటామని, తమ ఆందోళనను కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని, ప్రభుత్వం రోడ్డుపైకి వచ్చి మాట్లాడేంత వరకూ, తమ డిమాండ్లను నెరవేర్చే వరకూ ఉద్యమిస్తూనే ఉంటామని రైతులు పేర్కొంటున్నారు. తాము ఎవరితోనూ చర్చలు జరపమని, నేరుగా ప్రధాని నరేంద్ర మోదీతోయే తాము చర్చలు జరుపుతామని కరాఖండిగా తేల్చి చెబుతున్నారు. ఆకలి చావులతో అయినా చస్తాము కానీ... ఆందోళనను విరమించమని, ఢిల్లీకి తప్పకుండా చేరుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పరిస్థితి కొంత ఆందోళన కరంగా మారింది. పోలీసులు బారికేడ్లు పెట్టినా, ఆంక్షలు విధించినా, వాటర్ కెనన్లు వాడినా, తమ గమ్యం మాత్రం ఢిల్లీయే అని తేల్చి చెబుతున్నారు.


భారతీయ కిసాన్ యూనియన్ నేత గుర్నమ్ సింగ్ మాట్లాడుతూ..... రైతుల లక్ష్యం ఢిల్లీకి చేరుకోవడమేనని, ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా, ఏం చేసినా... తాము మాత్రం హస్తినకు చేరుకుంటామని స్పష్టం చేస్తున్నారు. రైతులు ఇంత స్పష్టంగా ప్రకటిస్తుండటంతో ప్రభుత్వం వర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి. మరో రైతు సంఘం నేత గురునామ్ సింగ్ చఢూనీ మాట్లాడుతూ... ఢిల్లీ దేశ రాజధాని, మిగితా వాటిని బీజేపీ పాకిస్తాని అని పిలుస్తుందని, కానీ... తాము పాకిస్తాన్ నుంచి రాలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని గురునామ్ డిమాండ్ చేశారు.


కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా నివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు దేశ రాజధానిని చుట్టుముట్టారు. కొవిడ్‌ కారణంగా ఢిల్లీలో ర్యాలీలకు అనుమతి లేదని ప్రభుత్వం చెప్పినప్పటికీ  అఖిల భారత కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ కమిటీతో పాటు భారతీయ కిసాన్‌ యూనియన్‌కు చెందిన వివిధ సంస్థలు ఇచ్చిన  ‘చలో ఢిల్లీ’ పిలుపు మేరకు అయిదు జాతీయ రహదారుల మీదుగా రైతులు రాజధాని వైపు కదిలారు. గజ గజ వణికించే చలిని కూడా వారు లెక్కచేయ లేదు.  కాగా, పంజాబ్‌,  హరియాణా, ఉత్తరప్రదేశ్‌, మఽఽధ్యప్రదేశ్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి దారితీసే అన్ని రహదారులను పోలీసులు అష్టదిగ్బంధనం చేయడంతో రైతులు బ్యారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించారు. వారిపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు.  బాష్పవాయువును ప్రయోగించారు.


Updated Date - 2020-11-27T12:45:16+05:30 IST