మోదీ అకౌంట్ ద్వారా తొలి ట్వీట్ చేసింది ఈవిడే
ABN , First Publish Date - 2020-03-08T17:00:39+05:30 IST
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ జీవితంలో ఎన్నో కష్టాలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురుకొని ప్రతిభామూర్తులుగా ఎదిగిన మహిళల జీవితగాధలు ప్రపంచానికి తెలియాలని తాను సోషల్మీడియాని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఏడుగురు ప్రతిభావంతులైన మహిళలు నేడు తన సోషల్మీడియా ద్వారా తమ అనుభవాలను ప్రపంచంతో పంచుకుంటారని ఆయన పేర్కొన్నారు.
అయితే మోదీ ట్వీట్టర్ ఖాతా ద్వారా మొట్టమొదటిగా స్నేహ మోహన్దాస్ అనే మహిళ తన అనుభవాలను తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. చెన్నైకి చెందిన స్నేహ అకలితో బాధపడుతున్నవారిని ఆదుకొనేందుకు ‘ఫుడ్ బ్యాంక్’ అనే సంస్థను స్థాపించారు. అయితే తాను ఈ సంస్థను స్థాపించడం వెనుక కారణం ఏంటని స్నేహ మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
‘‘నాకు ఇష్టమైన పని చేయడంలో నాకు సంతృప్తి ఉంటుంది. నాతో కలిసి పని చేసేందుకు నా తోటి పౌరులకు స్ఫూర్తి కలిగించాలని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఆకలి బాధతో ఉన్న ఒక వ్యక్తికి అయినా ఆహారాన్ని ఇచ్చి.. ఈ ప్రపంచాన్ని ఆకలి బాధ లేనిది మార్చాలని కోరుతున్నా. విదేశాల నుంచి వచ్చిన వాలంటీర్లతో కలిసి నేను పని చేస్తాను. మాకు 20 విభాగాలు ఉన్నాయి.. అంతేకాక, ఎంతో మంది స్ఫూర్తి పొంది మాతో కలిసి పని చేశారు. సామూహిక వంటలు, వంటల మారథాన్లు, తల్లిపాలను పిల్లలకు ఇవ్వడం వల్ల కలిగే ఉపయోగాలు వంటి వాటి గురించి మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము. ఆహారం అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు. అది ఒక మార్పు, పేదలకు బంగారు భవిత కలిగించగలదు. నేను, స్నేహ మోహన్దాస్. నా తల్లి ద్వారా స్ఫూర్తి పొందాను. ఆమె ఎందరో కష్టాల్లో ఉన్నవారి ఆకలి తీర్చింది. అదే నేను ‘ఫుడ్బ్యాంక్’ స్థాపించేందుకు స్ఫూర్తి’’ అంటూ స్నేహ ప్రధాని అకౌంట్ ద్వారా తన గురించి తెలియజేశారు.