వైద్యుల నిర్లక్ష్యమే బలిగొంది : కరోనా బాధితుని కుటుంబీకుల ఆరోపణ
ABN , First Publish Date - 2020-03-13T23:38:37+05:30 IST
భారత దేశంలో కరోనా వైరస్ కారణంగా మరణించిన తొలి వ్యక్తికి వైద్య సంరక్షణ సక్రమంగా అందలేదని ఆయన కుటుంబీకులు ఆరోపించారు.

కలబురగి (కర్ణాటక) : భారత దేశంలో కరోనా వైరస్ కారణంగా మరణించిన తొలి వ్యక్తికి వైద్య సంరక్షణ సక్రమంగా అందలేదని ఆయన కుటుంబీకులు ఆరోపించారు.
బాధితుని కుమారుడు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్ళిన వెంటనే వైద్యులు చికిత్స చేసి ఉంటే, ఆయన బతికి ఉండేవారని ఆవేదనతో చెప్పారు. ముందుగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఆయనను తీసుకెళ్ళగా, చికిత్స చేసేందుకు నిరాకరించారని చెప్పారు. అనంతరం ఈ నెల 8న మరొక ఆసుపత్రికి తీసుకెళ్ళామని, అయితే ఆ ఆసుపత్రివారు కూడా తన తండ్రిని హైదరాబాద్ తీసుకెళ్ళిపోవాలని చెప్పారని తెలిపారు. తాము హైదరాబాద్ వెళ్ళేందుకు సిద్ధంగా లేమని, అయినప్పటికీ తమను బలవంతపెట్టి హైదరాబాద్ వెళ్ళేలా చేశారని తెలిపారు. తాము హైదరాబాద్ తీసుకెళ్ళామని, అయితే అక్కడ ఏ ఆసుపత్రివారూ ఆయనను చేర్చుకోలేదని, ఆయన దుబాయ్ నుంచి వచ్చినందువల్ల తాము చేర్చుకోబోమని చెప్పారని తెలిపారు.
మరొక ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల తన తండ్రిని గుల్బర్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తీసుకెళ్ళామని, అయితే మరణించిన వ్యక్తిని తీసుకొచ్చారని అక్కడి వైద్యులు చెప్పారని తెలిపారు.
ఈ నెల 9 సాయంత్రం 4 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 2 గంటల వరకు తాము హైదరాబాద్లో అంబులెన్స్లో తిరిగామని, ఏ ఆసుపత్రిలోనూ తన తండ్రికి చికిత్స చేయించలేకపోయామని తెలిపారు.
ఇదిలావుండగా, కలబురగి డిప్యూటీ కమిషనర్ శరత్ వాదన మరోలా ఉంది. వైద్య సలహాకు విరుద్ధంగా రోగిని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకెళ్లారని, ఆ విషయం తెలిసిన వెంటనే ఆ రోగిని తిరిగి గుల్బర్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (గిమ్స్)కు తీసుకొచ్చేందుకు ఓ బృందాన్ని హైదరాబాద్ పంపించామని తెలిపారు. ఆ రోగిని గిమ్స్కు తీసుకొచ్చిన తర్వాత ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారని తెలిపారు.