నెట్ఫ్లిక్స్ చూస్తూ టైం పాస్ చేశా.. కరోనా బాధితుడి క్వారంటైన్ అనుభవం
ABN , First Publish Date - 2020-03-17T03:53:46+05:30 IST
ఢిల్లీలో తొలి కరోనా బాధితుడు రోహిత్ దత్తా. 45ఏళ్ల రోహిత్ ఇటీవలే ఇటలీ నుంచి తిరిగొచ్చారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో తొలి కరోనా బాధితుడు రోహిత్ దత్తా. 45ఏళ్ల రోహిత్ ఇటీవలే ఇటలీ నుంచి తిరిగొచ్చారు. ఆయనకు కరోనా సోకినట్లు గుర్తించిన అధికారులు వెంటనే సఫ్దార్జంగ్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఇక్కడే 14 రోజులుగా క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే క్వారంటైన్ నుంచి బయటకొచ్చిన రోహిత్ మీడియాతో మాట్లాడారు. తనున్న ఐసోలేషన్ వార్డు లగ్జరీ హోటల్లా ఉందని, అక్కడ చాలా ప్రశాంతంగా గడిపానని చెప్పారు. రోజూ నెట్ఫ్లిక్స్లో నచ్చిన వీడియోలు చూస్తూ సమయం వెళ్లబుచ్చానని తెలియజేశారు. ‘నేను పేషెంట్ననే భావనే నాకు రాలేదు. ఏదో లగ్జరీ హోటల్లో విలాసంగా గడిపినట్లు అనిపించింది. కుటుంబంతో రోజూ వీడియో కాల్ చేసి మట్లాడేవాడిని, దీని వల్ల కుటుంబానికి దూరంగా ఉన్న ఫీలింగ్ కలగలేదు’ అని రోహిత్ వెల్లడించారు. తొలుత కరోనా పాజిటివ్ అని తేలినప్పుడు తాను చాలా భయపడ్డానని, కానీ వైద్యులు తనలో ధైర్యం నింపారని తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తనకు స్వయంగా ఫోన్ చేసి హోలీ శుభాకాంక్షలు చెప్పారని, అలాగే డిశ్చార్జి అయ్యేటప్పుడు కూడా ఫోన్ చేసి విష్ చేశారని రోహిత్ పేర్కొన్నారు.