కరోనా కల్లోలం: బెడ్ కోసం ఆసుపత్రుల చుట్టూ... మృతి చెందాక సిబ్బంది చుట్టూ...
ABN , First Publish Date - 2020-07-19T11:29:21+05:30 IST
కరోనా వైరస్ కేసులు అంతకంతకు పెరుగుతున్నప్పటికీ, వైద్య సేవలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఒక కరోనా బాధితురాలికి సరైన వైద్యం అందక మృతి చెందిన ఉదంతం యూపీలో చర్చనీయాంశంగా...

లక్నో: కరోనా వైరస్ కేసులు అంతకంతకు పెరుగుతున్నప్పటికీ, వైద్య సేవలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఒక కరోనా బాధితురాలికి సరైన వైద్యం అందక మృతి చెందిన ఉదంతం యూపీలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే లక్నో పరిధిలోని లాల్కువాకు చెందిన 57 ఏళ్ల మహిళ జూలై 14న కరోనా లక్షణాలతో పరీక్ష చేయించుకుంది. జూలై 16 సాయంత్రం వచ్చిన రిపోర్టులో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు లోక్బంధు ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో లోక్బంధు ఆసుపత్రి వైద్యబృందం బాధితురాలిని హయ్యర్ స్పెషలిస్ట్ ఆసుపత్రికి తరలించింది. అయితే అంతకుముందు పీజీఐకి పంపించే విషయమై చర్చ జరిగింది. అయితే అక్కడ పడకలు లేకపోవడంతో కేజీఎంయూకు తరలించారు. అయితే అక్కడికి తీసుకు వచ్చాక బాధితురాలికి బెడ్ అందుబాటులో లేదు. దీంతో అక్కడి వైద్యులు బాధితురాలిని ఎరా మెడికల్ కాలేజీకి పంపించారు. అయితే అక్కడికి తీసుకెళ్లిన తరువాత వైద్యుల బృందం బాధితురాలిని పరిశీలించి, అప్పటికే మృతి చెందిందని తెలిపారు. దీంతో మృతురాలి కుటుంబీకులు అంతిమ సంస్కారాల కోసం సీఎంవో కంట్రోల్ రూమ్ సిబ్బందిని సంప్రదించారు. మృతదేహాన్ని త్వరగానే పంపిస్తామని అక్కడి నుంచి హామీ లభించింది. అర్ధరాత్రి 12 గంటలు దాటినా మృతదేహాన్ని తీసుకురాకపోవడంతో వారు డీఎంకు ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి కూడా స్పందన లేకపోవడంతో మృతురాలి బంధువులు జిల్లా ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని సంప్రదించారు. దీంతో మర్నాటి సాయంత్రం 4 గంటలకు మృత దేహం అంబులెన్స్లో రావడంతో కుటుంబసభ్యులు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం కారణంగానే తన తల్లి మృతిచెందిందని కుమారుడు సంజయ్ యాదవ్ ఆరోపించారు. కాగా ఈ ఉదంతంపై సిఎంఓ డాక్టర్ నరేంద్ర అగర్వాల్ మాట్లాడుతూ ఈ ఉదంతంలో నిర్లక్ష్యం ఎక్కడ చోటుచేసుకుందో తెలుసుకునేందుకు విచారణ జరుపుతామన్నారు.