కొవిడ్ ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్
ABN , First Publish Date - 2020-12-19T06:57:18+05:30 IST
దేశ వ్యాప్తంగా కొవిడ్ చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల్లో ఫైర్సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.

4 వారాల్లోగా ఎన్ఓసీ తీసుకోవాలి: సుప్రీం
న్యూఢిల్లీ, డిసెంబరు 18: దేశ వ్యాప్తంగా కొవిడ్ చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల్లో ఫైర్సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఆయా ఆస్పత్రులన్నీ ఆగ్నిమాపక శాఖ నుంచి నాలుగు వారాల్లోగా నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) తీసుకోవాలని స్పష్టం చేసింది. లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.ఎ్స.రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షాతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. ఎన్ఓసీ పొంది, వాటి గడువు ముగిసిన ఆస్పత్రులు నాలుగు వారాల్లోగా పునరుద్ధరించుకోవాలని సూచించింది. రాజ్కోట్లోని కొవిడ్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు మరణించిన ఘటనపై చేపట్టిన విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలకు సంబంధించి పూర్తి వివరాలతో నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.