ఆంక్షల సమయంలోనూ వీధుల్లో కలయ తిరుగుతున్న ఎమ్మెల్యే! ఎందుకో తెలిస్తే..
ABN , First Publish Date - 2020-03-23T23:36:34+05:30 IST
కరోనా కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో మిజోరం రాష్ట్రానికి చెందిన ఎమ్మేల్యేలు ఇంటికే పరిమితమవుతున్నారు. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం వీధుల్లో కలయ తిరుగుతూ ప్రజలు కరోనా బారిన పడకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు.
![ఆంక్షల సమయంలోనూ వీధుల్లో కలయ తిరుగుతున్న ఎమ్మెల్యే! ఎందుకో తెలిస్తే..](https://media.andhrajyothy.com/appimg/galleries/2020032306035674/03232020180617n91.jpg)
గువహటీ: కరోనా కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో మిజోరం రాష్ట్రానికి చెందిన ఎమ్మేల్యేలు ఇంటికే పరిమితమవుతున్నారు. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం వీధుల్లో కలయ తిరుగుతూ ప్రజలు కరోనా బారిన పడకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఆయనే.. లాల్రిన్సంగా రాల్తే. మిజోరమ్, అసోం, మణిపూర్ రాష్ట్రాల సరిహద్దు వద్ద ఉన్న ఓ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంటారు. సరిహద్దుకు సమీపంలోని గ్రామాల ప్రజల ఆరోగ్యం కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. బోర్డర్కు సమీపంలోని తొమ్మది ప్రాంతాల్లో 18 నీళ్ల ట్యాంకులను ఏర్పాటు చేశారు. కరోనా కట్టడికి పరిశుభ్రతే ఆయుధం కాబట్టి ప్రజలు చేతులు కడుక్కునేందుకు ఆయన ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఓ పక్కన నీటి కొరత వేధిస్తున్నా వెనకడుగు వేయని ఆయన.. ఓ ఎన్జీఓతో కలసి నిరంతరం నీరు అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. వీధుల్లో కలయ తిరుగుతూ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. ఈ విషయమై ఆయన్ను స్థానిక మీడియా ఆయన్ను సంప్రదించగా.. రాల్తే ఇలా స్పందించారు. ‘నా నియోజకవర్గానికి పొరుగు రాష్ట్రాల తాకిడి ఎక్కువ. కాబట్టి ప్రజలు కరోనా బారిన పడకుండా ఈ చర్యలు చేపట్టాను’ అని ఆయన వ్యాఖ్యానించారు.