రైతుల నిరసనలతో రోజుకు రూ.3,500 కోట్ల నష్టం: అసోచామ్
ABN , First Publish Date - 2020-12-15T19:33:16+05:30 IST
రైతుల నిరసనలతో అంతర్రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం కనిపిస్తోందని భారత ట్రేడ్ ..
న్యూఢిల్లీ: రైతుల నిరసనలతో అంతర్రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం కనిపిస్తోందని భారత ట్రేడ్ అసోసియేషన్ 'అసోచామ్' ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయ చట్టాలపై తలెత్తిన ప్రతిష్టభనను తొలగించుకోవాలని ప్రభుత్వం, రైతు సంస్థలను కోరింది. నిరసనల కారణంగా వాల్యూ చైన్, రవాణాకు అంతరాయం కలిగి రోజుకు రూ.3,000 కోట్ల నుంచి 3,500 కోట్ల వరకూ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతోందని అంచనా వేసింది.
పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లు ప్రధానంగా వ్యవసాయం, హార్టికల్చర్పై ఆధారపడుతున్నప్పటికీ, ఫుడ్ ప్రోసెసింగ్, కాటన్ టెక్స్టైల్స్, ఆటోమొబైల్, ఫార్మ్ మెషనరీ, ఐటీ వంటవి వారి లైఫ్లైన్గా ఉందని అసోచామ్ పేర్కొంది. దీనికి అదనంగా పర్యటకం, వాణిజ్యం, రవాణా, హాస్పిటాలిటీ వంటివి ఆ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థకు తోడవుతున్నాయని తెలిపింది.
పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రసాద్. జమ్మూకశ్మీర్ల సమష్టి ఆర్థిక వ్యవస్థ సుమారు రూ.18 లక్షల కోట్లని పేర్కొంది. రైతుల ఆందోళన, రోడ్లు, టోల్ ప్లాజాలు, రైల్వేల నిర్బంధాల వల్ల ఆర్థిక కార్యకలపాలు నిలిచిపోతున్నట్టు అసోచాం అధ్యక్షుడు నిరంజన్ హీరానందని తెలిపారు. క్రిస్మమ్ వంటి పండుగల సమయంలో ఎగుమతి అర్డర్లకు తగినట్టుగా వస్త్రాలు, ఆటో విడిభాగాలు, సైకిళ్లు, క్రీడా వస్తువుల ఎగుమతికి అవాంతరాలు తలెత్తున్నాయని, ఇందువల్ల అంతర్జాతీయ కొనుగోలుదారుల విశ్వాసాన్ని కోల్పోతామని చెప్పారు.
సప్లయ్ చైన్కు తలెత్తున్న తీవ్ర అంతరాయాల వల్ల పరిశ్రమలు, రైతులు, వినియోగదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ తెలిపారు. కోవిడ్ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటున్న తరుణంలో తాజా అంతరాయాలు తలెత్తడం దురదృష్టకరమని అన్నారు.