దేశవ్యాప్త ఆందోళనకు రైతుల పిలుపు.. 14న నిరాహారదీక్ష
ABN , First Publish Date - 2020-12-14T03:32:43+05:30 IST
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు.

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న రైతులు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రేపు (సోమవారం) ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో తాము ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లోనే రైతులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపట్టనున్నారు. అలాగే, మిగతా రాష్ట్రాల్లోనూ ధర్నాలు చేపట్టాలని రైతుల సంఘాలు పిలుపునిచ్చాయి. ఆందోళన చేస్తున్న రైతు సంఘాలన్నీ ఐక్యంగానే ఉన్నట్టు రైతులు తెలిపారు. అలాగే, ఈ నెల 19 నుంచి తలపెట్టిన ఆమరణ నిరాహారదీక్షను రద్దు చేసినట్టు రైతు సంఘాల నేతలు తెలిపారు. మరోవైపు, రైతు సంఘాల్లో కొన్ని నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ రైతులు తనను కలిసి నూతన చట్టాలకు మద్దతు తెలిపినట్టు చెప్పారు. కొత్త చట్టాలకు మద్దతు ఇచ్చే సంఘాలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.