కరోనా పేషెంట్ మృతదేహంతో కుటుంబం పరారీ.. పోలీసుల రంగప్రవేశంతో..!

ABN , First Publish Date - 2020-06-18T21:49:14+05:30 IST

కరోనా పేషెంట్ మృతదేహాన్ని ‘తస్కరించి’ తమ స్వస్థలానికి తీసుకెళ్లేందుకు ఓ కుటుంబం సినీఫక్కీలో ప్రయత్నించి..

కరోనా పేషెంట్ మృతదేహంతో కుటుంబం పరారీ.. పోలీసుల రంగప్రవేశంతో..!

న్యూఢిల్లీ: కరోనా పేషెంట్ మృతదేహాన్ని ‘తస్కరించి’ తమ స్వస్థలానికి తీసుకెళ్లేందుకు ఓ కుటుంబం సినీఫక్కీలో ప్రయత్నించి విఫలమైంది. బుధవారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. జిల్లా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన ఈ ఘటనపై వివరాల్లోకి వెళితే... ఈ నెల 1న కరోనా బారిన పడిన ఓ వ్యక్తి సర్ గంగారాం ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందాడు. మృతుడిని ఉత్తర ప్రదేశ్‌లోని మొరదాబాద్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి ఐటీవో సమీపంలోని ఓ శ్మశానంలో ఖననం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.


అయితే ఆస్పత్రి నుంచి అంబులెన్సులో బయటికి వెళ్లిన మృతదేహం ఎంతసేపటికీ శ్మశానానికి చేరుకోలేదు. దారి మధ్యలోనే దాదాపు 30 మంది కుటుంబ సభ్యులు బలవంతంగా మరో అంబులెన్సులో మృతదేహాన్ని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో వారిని గుర్తించి వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలంటూ అధికారులు పోలీసులను అప్రమత్తం చేశారు. కొన్ని కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత జిల్లా అధికారులు ఫోన్ ద్వారా కుటుంబీకులను సంప్రదించినట్టు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని వెనక్కి తీసుకురావాలంటూ హెచ్చరించడంతో బాధితుడి బంధువులు వెనక్కి తగ్గినట్టు తెలిపారు. ఎట్టకేలకు బుధవారం అర్థరాత్రి దాటాక పోలీసుల సమక్షంలో మృతదేహాన్ని ఖననం చేశారు. 

Updated Date - 2020-06-18T21:49:14+05:30 IST