ప్రధాని మోదీకి యూరోపియన్ పార్లమెంటేరియన్ల లేఖ
ABN , First Publish Date - 2020-11-26T18:48:29+05:30 IST
ప్రజాస్వామిక రాజ్యాంగ బాధ్యత పట్ల భారత దేశం ప్రదర్శిస్తున్న

బ్రసెల్స్ : ప్రజాస్వామిక రాజ్యాంగ బాధ్యత పట్ల భారత దేశం ప్రదర్శిస్తున్న గౌరవానికి యూరోపియన్ పార్లమెంటేరియన్లు మద్దతు పలికారు. తీవ్రవాదం, ఉగ్రవాదాలను ఎదుర్కొనడం ఉమ్మడి లక్ష్యమని, దీనికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ నెల 24న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వీరు రాసిన లేఖలో భారత దేశానికి సంఘీభావం ప్రకటించారు.
యూరోపియన్ పార్లమెంటు ఫ్రెంచ్ మెంబర్ థియెరీ మరియాని, ఇటాలియన్ మెంబర్ గియానా గన్షియా భారత దేశానికి మద్దతు ప్రకటించారు. ఉగ్రవాదం, తీవ్రవాదంపై పోరులో అండగా ఉంటామన్నారు. 2008 నవంబరు 26న ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడి బాధితులకు సంఘీభావం ప్రకటిస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఉగ్రవాద సంస్థలతో తనకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను తిరస్కరించేందుకు పాకిస్థాన్ ప్రయత్నించినప్పటికీ, ఇది అంతర్జాతీయ ముప్పుగా పరిణమించిందన్నారు.
పాకిస్థాన్పైనా, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న, మద్దతిస్తున్న వ్యక్తులు, ఉగ్రవాదులపైనా ఆంక్షలు విధించాలని యూరోపియన్ యూనియన్ను కోరినట్లు వీరు తెలిపారు. ప్రభుత్వాలు ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తుండటాన్ని ఖండించాలని కోరినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశం 2020 నవంబరు 26న సంవిధాన్ దినోత్సవాలను జరుపుకుంటున్న సందర్భంగా అభినందనలు తెలిపారు. స్వేచ్ఛ, శాంతిభద్రతలు, ప్రజాస్వామిక విలువలను పరిరక్షిస్తున్నందుకు, రాజ్యాంగాన్ని సమర్థిస్తున్నందుకు భారత దేశాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని స్థాపించడంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన కృషిని ప్రశంసించారు.
గణతంత్ర భారత దేశం ఇంకా యవ్వన దశలోనే ఉందని, సుప్రసిద్ధ చరిత్ర, సంస్కృతి ఉన్నాయని పేర్కొన్నారు. విభిన్న రాష్ట్రాలు, సంస్కృతులు, మతాలతో భారత దేశం స్వేచ్ఛా ప్రపంచానికి, ప్రజాస్వామ్యానికి దిక్సూచి వంటిదన్నారు. ప్రజలంతా సమానులేనని భారత రాజ్యాంగం చెప్తోందన్నారు. ఈ రాజ్యాంగం చెప్తున్న హక్కులు, స్వేచ్ఛా సిద్ధాంతాలను సమర్థించడం, ప్రోత్సహించడంలో భారత దేశం అంకితభావం ప్రదర్శిస్తోందన్నారు.
2008 నవంబరు 26న ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడిలో 10 మంది పాకిస్థాన్కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరు తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ హౌస్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ ట్రైన్ స్టేషన్లపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోగా, వందల మంది గాయపడ్డారు. 9 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అజ్మల్ అమిర్ కసబ్ అనే ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. కసబ్కు ఉరి శిక్ష విధించడంతో పుణేలోని యెరవాడ కేంద్ర కారాగారంలో 2012 నవంబరు 11న ఉరి తీశారు.