బ్లడ్ బ్యాంకుల్లో రక్తం అందుబాటులో ఉండేలా జాగ్రత్తవహించాలి : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
ABN , First Publish Date - 2020-04-22T00:07:06+05:30 IST
దేశవ్యాప్తంగా బ్లడ్ బ్యాంకులలో తగినంత రక్తం అందుబాటులో ఉండేలా

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్లడ్ బ్యాంకులలో తగినంత రక్తం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్థన్ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు.
కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ హర్షవర్థన్ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారని తెలిపారు. బ్లడ్ బ్యాంకులలో తగినంత రక్తం అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారని చెప్పారు. రక్త సంబంధమైన అస్వస్థతలతో బాధపడేవారికి ప్రతి రోజూ రక్తం అవసరం ఉంటుందని తెలిపారు. తలసేమియా, హిమోఫిలియా వంటి వ్యాధిగ్రస్థులకు రోజూ రక్త మార్పిడి అవసరమవుతుందన్నారు. ఈ సేవలు అన్ని ఆసుపత్రుల్లో కొనసాగుతాయన్నారు. ఢిల్లీలో రోజుకు 24 గంటలు, వారంలో ఏడు రోజులు (24x7) సేవలందించే బ్లడ్ సర్వీసెస్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించినట్లు తెలిపారు. రక్తం కావలసినవారు, రక్త దానం చేయాలనుకునేవారు 011-23359379, 9319982104, 9319982105 నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని తెలిపారు.
‘ఈ-రక్త్కోశ్’ అన్లైన్ పోర్టల్ ద్వారా బ్లడ్ బ్యాంకులలో అందుబాటులో ఉన్న రక్తం వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని చెప్పారు.