కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి రాజీలేని కృషి
ABN , First Publish Date - 2020-05-09T08:54:35+05:30 IST
కరోనా వ్యాక్సిన్, ఔషధాల అభివృద్ధికి రాజీలేని కృషి చేస్తున్నట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) చైర్మన్ జి.సతీశ్రెడ్డి తెలిపారు.
![కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి రాజీలేని కృషి](https://media.andhrajyothy.com/appimg/galleries/2020050903165468/05092020032429n7.png)
డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డి
నోయిడా(యూపీ), మే 8: కరోనా వ్యాక్సిన్, ఔషధాల అభివృద్ధికి రాజీలేని కృషి చేస్తున్నట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) చైర్మన్ జి.సతీశ్రెడ్డి తెలిపారు. పీపీఈలు, శానిటైజర్లు, ఎన్-99 మాస్క్ల రూపకల్పనపైనా దృష్టిసారించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 5 లక్షలకుపైగా శానిటైజర్ బాటిళ్లను ఉత్పత్తి చేసి పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతానికి రోజూ 30వేల మాస్క్లు ఉత్పత్తి చేస్తున్నామని, త్వరలో ఆ సామర్థ్యాన్ని 60వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని కరోనా ఇన్ఫెక్షన్ నుంచి కాపాడగల పూర్తిస్థాయి ఫేస్ షీల్డ్తో పాటు మూడురకాల పీపీఈలను అభివృద్ధిచేసినట్లు చెప్పారు. ప్రజల వ్యక్తిగత సమాచార గోప్యతకు అత్యంత ప్రాధాన్యమిచ్చే సరికొత్త వీడియో కాన్ఫరెన్సింగ్ సాఫ్ట్వేర్ను కూడా రూపొందించామన్నారు. క్వారంటైన్లో ఉన్న వారి కదలికలను ట్రాక్ చేయగల సాఫ్ట్వేర్ రూపకల్పనకు డీఆర్డీవో కసరత్తు చేస్తోందని వివరించారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉన్న ఓ ప్రైవేటు వర్సిటీ శాస్త్రవేత్తలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.