ప్రతీ పేదకు రూ.7500 ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-04-21T09:49:48+05:30 IST
కేంద్ర ప్రభుత్వం పేదల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.7500 చొప్పున వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

రైతులూ, పెన్షనర్లకూ వర్తింపజేయాలి: మన్మోహన్ కమిటీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కేంద్ర ప్రభుత్వం పేదల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.7500 చొప్పున వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అన్ని జన్ధన్ ఖాతాల్లోనూ, పెన్షన్ ఖాతాల్లోనూ, పీఎం కిసాన్ పథకం కింద ఉన్న ఖాతాల్లోనూ ఈ మొత్తం వేయాలని కోరింది. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ విపత్తు కమిటీ సోమవారం సమావేశమై ఈ మేరకు తీర్మానం చేసింది. చిన్న మధ్యతరహా పరిశ్రమలను పునరుద్ధరించాలని, పంటల కొనుగోలు సజావుగా సాగేట్లు చూడాలని, వలస కూలీల సంక్షోభాన్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది.
కరోనా చికిత్స పరికరాలకు జీఎస్టీ రద్దు చేయాలి: రాహుల్
దేశంలో ప్రజలు ఇటు కరోనా వైర్సతో, అటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న దృష్ట్యా.. ఈ వ్యాధికి చికిత్స అందించే పరికరాలు, ఇతర సామగ్రికి జీఎస్టీ రద్దు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ.. ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో జీఎస్టీ వసూలు చేయడం తప్పు అని ట్విటర్లో పేర్కొన్నారు. ఈ మేరకు శానిటైజర్లు, సబ్బులు, మాస్కులు, ఆస్పత్రి ఫర్నీచర్, టెస్టింగ్ కిట్లు వంటి 18 కరోనా సంబంధిత వస్తువుల జాబితాను, జీఎస్టీ వివరాలను ట్విటర్లో రాహుల్ పోస్ట్ చేశారు.