క్లోరోక్విన్ వాడకంపై కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

ABN , First Publish Date - 2020-03-26T01:45:30+05:30 IST

కోవిడ్-19పై యుద్ధంలో భాగంగా తీసుకుంటన్న చర్యలు ప్రజలను మరింత అప్రమత్తంగా ఉండేలా ప్రోత్సహిస్తున్నాయి.

క్లోరోక్విన్ వాడకంపై కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

న్యూఢిల్లీ : కోవిడ్-19పై యుద్ధంలో భాగంగా తీసుకుంటన్న చర్యలు ప్రజలను మరింత అప్రమత్తంగా ఉండేలా ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని వదంతులు కూడా ప్రచారమవుతున్నాయి. మలేరియాకు వాడే మందులను ఈ వైరస్‌ సోకకుండా నిరోధించేందుకు ఉపయోగించవచ్చుననే ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది హైడ్రోక్సీక్లోరోక్విన్ మందులను విపరీతంగా కొంటున్నారు. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి రావడంతో, దీనిపై ప్రజలకు సరైన అవగాహన కల్పించేందుకు ప్రయత్నించింది.


వైద్యుల స్పష్టమైన సలహా లేకుండా హైడ్రోక్సీక్లోరోక్విన్‌ను వాడవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ప్రజలను హెచ్చరించింది. బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ హైడ్రోక్లోరోక్విన్ అనేది హెల్త్ కేర్ వర్కర్ల నిర్దిష్ట ఉపయోగం కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ మందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అందువల్ల దీనిని వైద్యుల సలహా లేకుండా తీసుకోవద్దని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. 


క్లోరోక్విన్ మందు గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన తర్వాత దీనిపై ప్రజల్లో మరింత ఆసక్తి ఏర్పడింది. ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ ఫ్రాన్స్, చైనాల్లో జరిగిన ప్రాథమిక అధ్యయనాల్లో హైడ్రోక్సీక్లోరోక్విన్, క్లోరోక్విన్ కోవిడ్-19 సోకినవారికి ఉపశమనం కలిగిస్తున్నట్లు తేలిందని చెప్పారు. ఈ మందులను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.


Updated Date - 2020-03-26T01:45:30+05:30 IST