పీఎం కేర్స్ ఫండ్కు ఇచ్చే విరాళాలపై 100 శాతం పన్ను మినహాయింపు
ABN , First Publish Date - 2020-04-01T21:34:31+05:30 IST
ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ (పీఎం-కేర్స్) నిధికి ఇచ్చే విరాళాలపై 100 శాతం పన్ను మినహాయింపు...

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ (పీఎం-కేర్స్) నిధికి ఇచ్చే విరాళాలపై 100 శాతం పన్ను మినహాయింపు లభించనుంది. ఈ మేరకు పీఎం కేర్స్ విరాళాలను ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80జీ కిందికి తీసుకొస్తూ కేంద్రం ఇవాళ ఆర్డినెన్స్ జారీ చేసింది. జూన్ 30 వరకు ఈ నిధికి విరాళాలు ఇచ్చే వ్యక్తులు, సంస్థలు 2019-20 ఆర్ధిక సంవత్సరపు ఆదాయం నుంచి మినహాయింపు కోరవచ్చునని ప్రభుత్వం తన ఆర్డినెన్స్లో పేర్కొంది.
ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 వంటి విపత్తులపై పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్కు ఇప్పటికే పెద్ద ఎత్తున స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీన్ని పన్ను మినహాయింపు కిందికి తీసుకురావడంతో మరింత ఆకర్షణీయంగా మలిచినట్టైంది. ఎవరైనా ఎంత మొత్తంలో అయినా వ్యక్తిగత విరాళాలు ఇచ్చే విధంగా వీలు కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారంలో ఈ నిధిని ప్రకటించారు. పీఎం కేర్స్ నిధికి ప్రధాని మోదీ చైర్మన్గా ఉండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇందులో సభ్యులుగా ఉన్నారు.