కొత్త ఎత్తుగడలతో డీకే శివకుమార్..!

ABN , First Publish Date - 2020-03-16T16:13:53+05:30 IST

రాష్ట్ర కాంగ్రెస్‌ సారథిగా నియమింపబడిన డి.కె.శివకుమార్‌ కొత్త వ్యూహం పన్నారు. పార్టీలో అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. గడిచిన ఐదారేళ్ళుగా పార్టీలో వలస, మూల అనే బేధాభిప్రాయాలు

కొత్త ఎత్తుగడలతో డీకే శివకుమార్..!

రాష్ట్ర కాంగ్రెస్‌ సారథిగా నియమింపబడిన డీకేశివకుమార్‌ కొత్త వ్యూహం పన్నారు. పార్టీలో అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. శుక్రవారం శాసనసభలో సిద్దరామయ్యను కలిశారు. ఇక పార్టీ సీనియర్‌ నేత శ్యామనూరు శివశంకరప్పకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం పొందారు.


బెంగళూరు(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర కాంగ్రెస్‌ సారథిగా నియమింపబడిన డి.కె.శివకుమార్‌ కొత్త వ్యూహం పన్నారు. పార్టీలో అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. గడిచిన ఐదారేళ్ళుగా పార్టీలో వలస, మూల అనే బేధాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. పలుమార్లు తెరపైకి వచ్చాయి. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగినంతకాలం మూల కాంగ్రెస్‌ వాదులకు అన్యాయం జరిగిందనే వాదనలు ఉండేవి. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వంలోనూ అటువంటి అభిప్రాయాలే వ్యక్తం అవుతూ వచ్చాయి. ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షుడిని ఎంపిక చేసే విషయంలో సిద్దరామయ్య ఆయనకు అత్యంత ఆప్తుడైన మాజీ మంత్రి ఎం.బి.పాటిల్‌ పేరును సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఇదే కారణంతోనే దాదాపు రెండు నెలలు పేరు ఖరారు చేసేందుకు అధిష్ఠానం వెనుకంజ వేస్తూ వచ్చింది. ఇటీవల డి.కె.శివకుమార్‌కే పదవి వరించింది. అప్పటి నుంచి డి.కె.శివకుమార్‌ పార్టీ సీనియర్‌లను ప్రసన్నం చేసుకునే దిశగా వ్యూహం పన్నారు. శుక్రవారం శాసనసభలో సిద్దరామయ్యను కలిశారు. ఇక పార్టీ సీనియర్‌ నేత శ్యామనూరు శివ శంకరప్పకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం పొందారు. శనివారం సిద్దరామయ్య నివాసానికి వెళ్ళి ఆయనను సత్కరించారు. పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేను భేటీ అయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న దినేశ్‌ గుండూరావు నివాసానికి వెళ్ళి ఆయనతో చర్చించారు. ఆయనకు సన్మానం చేశారు. ఆదివారం అదే పంథాలో ముందుకెళ్ళారు. మాజీ ముఖ్యమంత్రి వీరప్పమొయిలీ నివాసానికి వెళ్ళారు. కేంద్ర మాజీమంత్రి రెహమాన్‌ఖాన్‌ను కలసి సన్మానం చేశారు. ఇలా పార్టీ సీనియర్‌లను ప్రసన్నం చేసుకునే దిశగా ముందుకెడుతూనే జిల్లా అధ్యక్షులలో భారీగా మార్పులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నవారిలో ఎక్కువమంది సిద్దరామయ్య వర్గీయులుగా ముద్రపడినవారు ఉన్నారు. వారిలో ఎక్కువమందిని మార్పు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డి.కె.శివకుమార్‌ అందరినీ కలుపుకుపోనున్నారా... లేదా మూల కాంగ్రెస్‌ వర్గీయులదే హవా కానుందా..? అనేది మరికొంతకాలం వేచి చూడాల్సిందే.

Updated Date - 2020-03-16T16:13:53+05:30 IST