శశికళ విడుదల కోసం ఢిల్లీకి దినకరన్
ABN , First Publish Date - 2020-09-21T14:05:37+05:30 IST
అక్రమార్జన కేసులో బెంగళూరు పరపన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదల కోసం అమ్మా
చెన్నై(ఆంధ్రజ్యోతి) : అక్రమార్జన కేసులో బెంగళూరు పరపన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదల కోసం అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ ఢిల్లీకి పయనమయ్యారు. ఆదివారం ఉదయం చార్టెడ్ విమానంలో ఆయన బయల్దేరారు. శశికళ వాస్తవానికి వచ్చే యేడాది ఫిబ్రవరి 14న విడుదల కావాల్సి ఉంది. జైలులో సత్ప్రవర్తన, తక్కువగా పెరోలు సదుపాయం వాడుకోవడం వంటి కారణాల వల్ల జనవరి 27న విడుదలయ్యే అవకాశం ఉందని కర్నాటక జైళ్ళ శాఖ అధికారులు ఇటీవల ఆమె విడుదలపై ఆర్టీఐ చట్టం ప్రకారం సమాచారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో శశికళను అంతకంటే ముందుగా అంటే ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్ పాండ్యన్ చెబుతున్నట్టు ఈ నెలాఖరులోగా విడుదల చేయించే అవకాశాలు ఉన్నాయేమోనని దినకరన్ ఢిల్లీలోని సుప్రీం కోర్టు సీని యర్ న్యాయవాదుల వద్ద చర్చలు జరపాలనుకున్నారు. ఆ మేరకు ఆదివారం ఉదయం 9.40 గంటలకు ప్రత్యేక విమానంలో దినకరన్, ఆయన స్నేహితుడు మల్లిఖార్జునన్ ఢిల్లీకి బయల్దేరి వెళ్ళారు. ఢిల్లీలోకొద్ది రోజులపాటు ఆయన బసచేసి సుప్రీం కోర్టు న్యాయవాదులతోను, న్యాయనిపుణు లతోను శశికళ విడుదల గురించి సమగ్రంగా చర్చలు జరుపనున్నారు.