కశ్మీరులో సైన్యం ‘రాడికలైజేషన్ నిరోధక శిబిరాలు’ : జనరల్ బిపిన్ రావత్
ABN , First Publish Date - 2020-02-08T03:18:10+05:30 IST
జమ్మూ-కశ్మీరులో భారత సైన్యం నిర్వహిస్తున్న గుడ్విల్ పాఠశాలలు ‘రాడికలైజేషన్ నిరోధక శిబిరాలు’ అని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ చెప్పారు.

జమ్మూ-కశ్మీరులో భారత సైన్యం నిర్వహిస్తున్న గుడ్విల్ పాఠశాలలు ‘రాడికలైజేషన్ నిరోధక శిబిరాలు’ అని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. బాలలను రాడికలైజ్ చేయడాన్ని నిరోధించవలసిన అవసరం చాలా ఉందన్నారు.
రాజకీయ, సాంఘిక మార్పు కోసం అతివాదులుగా మారే విధంగా ప్రేరేపించడాన్ని రాడికలైజేషన్ అంటారు. ఇటీవల న్యూఢిల్లీలో జనవరిలో జరిగిన రైజినా డైలాగ్లో కూడా జనరల్ రావత్ కశ్మీరులో యువతను రాడికలైజ్ చేస్తున్నారని చెప్పారు. రాడికలైజేషన్కు గురవుతున్నవారిని గుర్తించి, డీ-రాడికలైజేషన్ శిబిరాలకు తరలించాలన్నారు.
లక్నోలో డిఫెన్స్ ఎక్స్పోలో పాల్గొన్న జనరల్ రావత్ శుక్రవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. డీ-రాడికలైజేషన్ క్యాంపులపై వైఖరి మారిందా? అని అడిగినపుడు జనరల్ రావత్ స్పందిస్తూ, ఓ వ్యక్తి రాడికలైజ్ అవడానికి అవకాశం ఇవ్వడం ఎందుకు? ఆ వ్యక్తిని మళ్లీ డీ-రాడికలైజ్ చేయడం ఎందుకు? అని అడిగారు. తాను డీ-రాడికలైజేషన్ క్యాంపుల గురించి చెప్పానని, క్యాంప్ అంటే సైనిక శిబిరం మాత్రమే కాదని, నిఘంటువును పరిశీలిస్తే వేర్వేరు అర్థాలు కనిపిస్తాయని చెప్పారు. కశ్మీరు లోయలో భారత సైన్యం 46 గుడ్విల్ పాఠశాలలను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, లోయలో ఆర్మీ గుడ్విల్ స్కూల్స్ ఉన్నాయని, ఇవి ఏమిటని అడిగారు. ఈ పాఠశాలలను ఎందుకు నడుపుతున్నామని ప్రశ్నించారు. పాఠశాలలను నడపటం తన విధి నిర్వహణలో భాగమా అని అడిగారు. కొందరు బాలలు ఆకతాయిగా తిరగకుండా, రాడికలైజ్ అవకుండా నిరోధించడానికే ఈ పాఠశాలలను నడుపుతున్నామని చెప్పారు. దీనిని డీ-రాడికలైజేషన్ అని ఎవరైనా అనవచ్చునని, అయితే తాను మాత్రం దీనిని రాడికలైజేషన్ నిరోధకమని అంటానని చెప్పారు. ఈ పాఠశాలల్లో చదివినవారు రాళ్లు, తుపాకులు పట్టుకోవడం లేదన్నారు.