ఆ స్టేషన్ నుంచి రైళ్లు నడవవు.. అక్కడే రైళ్లలోనే కరోనా ట్రీట్ మెంట్..!
ABN , First Publish Date - 2020-06-16T19:45:25+05:30 IST
దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో.. ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. ఢిల్లీలో ప్రతి ఒక్క పౌరుడికి కరోనా ట్రీట్ మెంట్ చేస్తామని ప్రభుత్వం సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో.. ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. ఢిల్లీలో ప్రతి ఒక్క పౌరుడికి కరోనా ట్రీట్ మెంట్ చేస్తామని ప్రభుత్వం సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 200 రైల్వే కోచ్ లను కరోనా ఐసోలేషన్ వార్డులుగా ఉపయోగించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్ లో 200 రైల్వే కోచ్ లను పట్టాలపైనే నిలిపి ఉంచుతున్నట్లు తెలిపింది. వాటిలో కరోనా రోగులకు ట్రీట్ మెంట్ ఇవ్వగలిగేలా ఇప్పటికే రీమోడలింగ్ చేశామని ఉత్తర రైల్వే చీఫ్ పీఆర్వో దీపక్ కుమార్ వెల్లడించారు.
200 రైల్వే కోచ్ లలో 500 ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశామని దీపక్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా దాదాపు 8వేల మంది కరోనా రోగులకు పడకలను కూడా సిద్ధం చేశామన్నారు. ఈ రైల్వే కోచ్ లను ఆనంద్ విహార్ స్టేషన్ పట్టాలపైనే ఉంచి.. రోగులకు ట్రీట్ మెంట్ ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. రోజువారీగా ఆ స్టేషన్ నుంచి వెళ్లే ప్రయాణికుల, సరుకు రవాణా రైళ్లను ఢిల్లీ జంక్షన్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లేలా ప్రణాళికను రూపొందించామన్నారు. ఈ రైల్వే కోచ్ లను కరోనా రోగుల చికిత్సకు అనుగుణంగా మార్చేందుకయిన ఖర్చును రైల్వే శాఖ భరించిందని దీపక్ కుమార్ స్పష్టం చేశారు. మెడికల్ స్టాఫ్ తోపాటు వైద్య సదుపాయాలను మాత్రం ఢిల్లీ ప్రభుత్వమే చూసుకుంటోందన్నారు.