ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు అసంతృప్తి

ABN , First Publish Date - 2020-06-18T22:01:05+05:30 IST

దేశ రాజధాని నగరంలోని భవనాలు భూకంపాలను తట్టుకుని నిలవగలిగేందుకు

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు అసంతృప్తి

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలోని భవనాలు భూకంపాలను తట్టుకుని నిలవగలిగేందుకు అవసరమైన ప్రణాళికల అమలులో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం, పురపాలక సంఘాల తీరుపై ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. భూకంపాలకు సంబంధించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, పురపాలక సంఘాలు సమర్పించిన అఫిడవిట్లపై కూడా అసంతృప్తి తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలన్ డివిజన్ బెంచ్ తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. 


న్యాయవాది అర్పిత్ భార్గవ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాజ్యం 2015 నుంచి పెండింగ్‌లో ఉంది. అర్పిత్  తాజాగా మరొక పిటిషన్‌ను దాఖలు చేశారు. సమీప భవిష్యత్తులో భారీ భూకంపాలు సంభవిస్తే, ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో కోర్టుకు తెలియజేయాలని పిటిషనర్ కోరారు. 


భార్గవ్ దాఖలు చేసిన తాజా పిటిషన్‌లో, ఢిల్లీలో ఏప్రిల్ 12 నుంచి చాలా భూకంపాలు సంభవించాయని తెలిపారు. ఏ సమయంలోనైనా భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. 


Updated Date - 2020-06-18T22:01:05+05:30 IST