కరోనా ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా మీడియా విభాగాలు...
ABN , First Publish Date - 2020-04-21T12:53:31+05:30 IST
కరోనా వైరస్ రోగులున్న ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా మీడియా విభాగాలను ఏర్పాటు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అధికారులకు ఆదేశాలు జారీ....

ఢిల్లీ సీఎం ఆదేశాలు
న్యూఢిల్లీ : కరోనా వైరస్ రోగులున్న ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా మీడియా విభాగాలను ఏర్పాటు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా రోగుల గురించి సరైన సమాచారాన్ని మీడియాతోపాటు సోషల్ మీడియాకు సమాచారం అందించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ కరోనా ఆసుపత్రుల్లో మీడియా విభాగాలను ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. కరోనా ఆసుపత్రుల గురించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో మీడియా సెల్స్ ఏర్పాటు అత్యంత ముఖ్యమని సీఎం చెప్పారు. ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్, మెడికల్ డైరెక్టర్లు, ఆసుపత్రి డైరెక్టర్లు వెంటనే మీడియా విభాగాలను ఏర్పాటు చేసి ప్రింట్, టీవీ మీడియాలతోపాటు సోషల్ మీడియాలోనూ సరైన సమాచారం పెట్టాలని సీఎం సూచించారు. తన తండ్రికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో వచ్చి తీవ్ర జ్వరం వచ్చినా వైద్యులెవరూ చికిత్స అందించలేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స సరిగా లేదని ఓ రోగి కుమార్తె తన తల్లితో కలిసి వీడియో చిత్రీకరించి దాన్ని ట్విట్టర్ లో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనాపై సరైన సమాచారం అందించేందుకు వీలుగా మీడియా విభాగాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశంతో పలు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రత్యేకంగా మీడియా విభాగాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యాయి.