ఉపశమించని ఢిల్లీ.... 15 రోజుల్లో రెట్టింపయిన కరోనా హాట్స్పాట్లు!
ABN , First Publish Date - 2020-06-04T13:39:25+05:30 IST
గడచిన 15 రోజుల్లో రాజధాని ఢిల్లీలో హాట్ స్పాట్ల సంఖ్య రెట్టింపయ్యింది. అలాగే కరోనా బాధితుల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. 15 రోజుల్లో 85 కొత్త హాట్స్పాట్లు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఢిల్లీలో...
![ఉపశమించని ఢిల్లీ.... 15 రోజుల్లో రెట్టింపయిన కరోనా హాట్స్పాట్లు!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020060408054596/06042020080843n59.gif)
న్యూఢిల్లీ: గడచిన 15 రోజుల్లో రాజధాని ఢిల్లీలో హాట్ స్పాట్ల సంఖ్య రెట్టింపయ్యింది. అలాగే కరోనా బాధితుల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. 15 రోజుల్లో 85 కొత్త హాట్స్పాట్లు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఢిల్లీలో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 158కి చేరింది. కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని కేంద్రం తెలిపింది. కాగా ఢిల్లీలో మూడవ దశ లాక్డౌన్లో కంటైన్మెంట్ జోన్లు క్రమంగా తగ్గాయి. అయితే మే 18 న నాల్గవ దశ లాక్డౌన్ అమలు చేసినప్పుడు 73 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. కానీ ప్రస్తుతం సగటున రోజుకు ఐదు కొత్త కంటైన్మెంట్ జోన్లు పెరుగుతున్నాయి. ఈ కంటైన్మెంట్ జోన్లన్నీ పూర్తిగా సీల్ చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో లాక్డౌన్ మినహాయింపులు ఉండవు. పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్ల వెనుక రోగుల సంఖ్య ప్రధాన కారణంగా నిలిచింది. గత 15 రోజుల్లో ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య 10 వేల నుంచి 23 వేలకు పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా రెట్టింపయ్యింది. ఢిల్లీలో నమోదవుతున్న కరోనా రోగులలో 85 శాతం మందిలో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు. ఢిల్లీలో ప్రస్తుతం 13,479 కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇందులో 8,405 మంది రోగులు హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.