ఫైనల్ ఎగ్జామ్స్, స్కూళ్లు తెరవడం.... కేంద్రం అభిప్రాయమిదే!
ABN , First Publish Date - 2020-08-11T10:51:36+05:30 IST
కాలేజీల్లో ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒకవైపు అన్ని కాలేజీల్లో ఫైనల్ ఇయర్ పరీక్షలను రద్దు చేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు విచారిస్తోంది.

న్యూఢిల్లీ: కాలేజీల్లో ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒకవైపు అన్ని కాలేజీల్లో ఫైనల్ ఇయర్ పరీక్షలను రద్దు చేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. మరోవైపు మానవ వనరుల అభివృద్ధిశాఖకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణతో పాటు పాఠశాలల ప్రారంభం, ఆన్లైన్ తరగతులపై కూడా చర్చించారు. కళాశాలల్లో 2020 సంవత్సరాన్ని జీరో ఇయర్గా ప్రకటించకూడదని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే సెప్టెంబర్లో పరీక్షలు జరుగుతాయా లేదా అనే దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, ఈ ఏడాది చివరినాటికి పరీక్షలు నిర్వహించడం గురించి చర్చ జరిగింది. కాగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు కళాశాలల్లో చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించడానికి నిరాకరించాయి. ఈ సమావేశంలో పాఠశాలల ప్రారంభానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. పాఠశాలల్లో 3 వ తరగతి వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించకూడదని సూచించారు. మిగిలిన తరగతులకు పూర్తి షెడ్యూల్తో ఆన్లైన్ తరగతులను నిర్వహించాల్సి ఉంటుందని భావిస్తున్నారు.