ఈసారి ఎర్ర కోట వద్ద విద్యార్థులు లేకుండానే స్వాతంత్ర్య దినోత్సవాలు

ABN , First Publish Date - 2020-07-14T23:32:33+05:30 IST

చరిత్రలో తొలిసారి భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థినీ,

ఈసారి ఎర్ర కోట వద్ద విద్యార్థులు లేకుండానే స్వాతంత్ర్య దినోత్సవాలు

న్యూఢిల్లీ : చరిత్రలో తొలిసారి భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థినీ, విద్యార్థులు లేకుండా జరగబోతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అమలు చేస్తున్న నిబంధనల కారణంగా నిరాడంబరంగా స్వాతంత్ర్య దినోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించే కార్యక్రమానికి గతంలో హాజరైనవారితో పోల్చుకుంటే ఈ ఏడాది కేవలం 20 శాతం మంది వీవీఐపీలు, ప్రేక్షకులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 


రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ ఇటీవల ఎర్ర కోటను సందర్శించి, స్వాతంత్ర్య దినోత్సవాల సన్నాహాలను పరిశీలించారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో భౌతిక దూరం పాటించవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కోరారు. 


ఈ వేడుకల్లో విద్యార్థినీ, విద్యార్థులు పాలుపంచుకోబోరని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నేషనల్ కేడెట్ కార్ప్స్ కేడెట్లు పాల్గొంటారని పేర్కొన్నాయి. 


ప్రధాన మంత్రి ప్రసంగించే ప్రదేశం వద్ద గతంలో సుమారు 900 మంది వీవీఐపీలు ఆసీనులయ్యేవారు. ఈసారి మాత్రం సుమారు 100 మంది వీవీఐపీలు మాత్రమే హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. వీరు కూర్చొనడానికి మోదీ ప్రసంగించే ప్రాకారంలో కాకుండా దాని కన్నా దిగువ ఉన్న ప్రదేశంలో ఏర్పాట్లు చేస్తున్నారు. 


మరొక విశేషం ఏమిటంటే, కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకున్న 1,500 మంది ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. వీరిలో 500 మంది స్థానిక పోలీసు సిబ్బంది కాగా, మిగిలినవారు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. 


Updated Date - 2020-07-14T23:32:33+05:30 IST