లాక్డౌన్ ఎఫెక్ట్: గోవాలో 67 శాతం తగ్గిన క్రిమినల్ కేసులు!
ABN , First Publish Date - 2020-05-10T01:29:01+05:30 IST
కొవిడ్-19 లాక్డౌన్ నేపథ్యంలో గోవాలో క్రిమినల్ కేసులు 67 శాతం తగ్గినట్టు రాష్ట్ర పోలీసులు వెల్లడించారు...
![లాక్డౌన్ ఎఫెక్ట్: గోవాలో 67 శాతం తగ్గిన క్రిమినల్ కేసులు!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020050907550690/05092020195848n30.jpg)
పనాజీ: కొవిడ్-19 లాక్డౌన్ నేపథ్యంలో గోవాలో క్రిమినల్ కేసులు 67 శాతం తగ్గినట్టు రాష్ట్ర పోలీసులు వెల్లడించారు. ‘‘గతేడాది ఇదే సమయంలో దాదాపు 300 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కానీ ఈసారి మాత్రం నేరాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి..’’ అని గోవా స్పెషల్ బ్రాంచి ఎస్పీ శోభిత్ సక్సేనా పేర్కొన్నారు. చోరీలు, దోపిడీలు, గాయపర్చడం తదితర నేరాలు తగ్గుముఖ పట్టినట్టు ఆయన తెలిపారు. కాగా గతంలో రోడ్డు ప్రమాదాల కారణంగా రోజుకు ఒక్కరైనా ప్రాణాలు కల్పోయేవారనీ.. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా దాదాపు అలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం లేదన్నారు. లాక్డౌన్ ఉల్లంఘనలకు సంబంధించి మాత్రం దాదాపు 650 కేసులు నమోదైనట్టు ఎస్పీ వెల్లడించారు. గోవా ప్రస్తుతం కరోనా రహిత రాష్ట్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ దేశవ్యాప్త లాక్డౌన్ పొడిగింపుపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఇటీవల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 4 నుంచి కొన్ని మినహాయింపులతో లాక్డౌన్ పొడిగించగా.. గోవా ప్రభుత్వం మే 17 వరకు 144 సెక్షన్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.