కరోనా కల్లోలం: దేశంలో ఒక్క జూలైలోనే 11 లక్షలకు మించిన కేసులు!
ABN , First Publish Date - 2020-08-01T12:26:43+05:30 IST
దేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 57,000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 57,000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒకే రోజులో కరోనా కేసుల్లో అతిపెద్ద జంప్ ఇది. జూలై నెలలో 11.1 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 19,122 మంది మృతి చెందారు. జూన్ నెలతో పోలిస్తే జూలైలో 2.8 శాతం అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. జూన్ నెలలో సుమారు 4 లక్షల కేసులు ఉన్నాయి. కాగా జూలైలో కరోనా కారణంగా మృతిచెందినవారి సంఖ్య జూన్ కంటే 1.6 రెట్లు అధికంగా ఉంది. జూన్ నాటికి కరోనా కారణంగా మృతిచెందినవారి సంఖ్య 11,988. జూలైలో కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందింది. గత 15 రోజుల్లో 7.3 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య జూలై మొదటి భాగానికి దాదాపు రెట్టింపు. కాగా శుక్రవారం కొత్తగా 57,151 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో 50,000కి పైగా కరోనా కేసులు నమోదవడం వరుసగా ఇది నాలుగవ రోజు. శుక్రవారం కరోనా కారణంగా 766 మంది మృతిచెందారు. ఒకే రోజులో 750కి పైగా మరణాలు సంభవించడం వరుసగా ఇది నాలుగవ రోజు. భారతదేశంలో ఇప్పటివరకు 16,96,780 కరోనా కేసులు నమోదయ్యాయి. 36,551 మంది ఇన్ఫెక్షన్ కారణంగా మృతిచెందారు.