కొవిడ్-19: ఆ రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఉద్ధవ్ సర్కారు ఊరట!

ABN , First Publish Date - 2020-11-26T05:00:00+05:30 IST

ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, గోవా తదితర రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వచ్చే విమానాల్లోని క్యాబిన్, క్రూ సిబ్బందికి ఉద్ధవ్ థాకరే...

కొవిడ్-19: ఆ రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఉద్ధవ్ సర్కారు ఊరట!

ముంబై: ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, గోవా తదితర రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వచ్చే విమానాల్లోని క్యాబిన్, క్రూ సిబ్బందికి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఈ రాష్ట్రాల నుంచి వచ్చే విమాన సిబ్బంది ఇకపై కొవిడ్-19 నెగిటివ్ సర్టిఫికెట్‌ తీసుకు రావాల్సిన అవసరం లేదని ప్రకటించింది. కాగా ఢిల్లీ, రాజస్థాన్, గోవా రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల నుంచి రోడ్డు, రైలు, విమానాల ద్వారా వచ్చే వారికి అర్టీ-పీసీటీ నెగిటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి చేస్తూ సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశాల నుంచి విమాన సిబ్బందిని మినహాయిస్తున్నట్టు మహారాష్ట్ర సీఎస్ సంజయ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘మహారాష్ట్రలోనూ, వెలుపలా తాము రోజూ వందే భారత్ విమానాలతో పాటు, పలు కార్గో విమానాలను కూడా నడుపుతున్నామంటూ ఎయిరిండియా నుంచి మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి అందింది. ఈ కారణంగా పెద్ద సంఖ్యలో విమాన, కాక్‌పిట్ సిబ్బంది మహారాష్ట్రకు, అక్కడి నుంచి అనేక రాష్ట్రాలకు రోజువారీ విధుల నిమిత్తం వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారం వీరందరికీ విమానాశ్రయాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేయడం వల్ల విమాన సమయాల్లో తీవ్ర ఆలస్యం చోటుచేసుకుంటోంది. దీంతో విధి నిర్వహణలో ఉన్న అన్ని విమాన సంస్థలకు చెందిన క్రూ, కాక్‌పిట్ సిబ్బందిని ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపునివ్వడం జరిగింది..’’ అని సీఎస్ పేర్కొన్నారు. అయితే రాష్ట్రానికి వచ్చే మిగతా ప్రయాణికులంతా ముంబై, పుణే, నాగ్‌పూర్, ఔరంగాబాద్ విమానాశ్రయాల్లో దిగేందుకు 72 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయించుకుని తీరాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక రోడ్డు, రైలు మార్గాల్లో వచ్చే వారికి అధికారులు ఆయా జిల్లా సరిహద్దుల వద్దే ఆరోగ్య లక్షణాలు, శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించి రాష్ట్రంలోకి అనుమతిస్తారని ప్రభుత్వం పేర్కొంది. 

Updated Date - 2020-11-26T05:00:00+05:30 IST