బస్టాండ్ వద్ద కరోనా బాధితుని మృతదేహం.... దర్యాప్తునకు సీఎం ఆదేశం!
ABN , First Publish Date - 2020-05-18T12:13:42+05:30 IST
గుజరాత్లోని అహ్మదాబాద్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇక్కడ కరోనా రోగుల సంఖ్య 8000 దాటింది. అయినప్పటికీ, పరిపాలనా యంత్రాంగం నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది.

అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇక్కడ కరోనా రోగుల సంఖ్య 8000 దాటింది. అయినప్పటికీ, పరిపాలనా యంత్రాంగం నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. అహ్మదాబాద్లోని ఒక బస్టాండ్ వద్ద కోవిడ్ -19 బాధితుని మృతదేహం పడివుంది. ఈ ఉదంతంపై మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రివర్గాలపై, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంగతి తెలుసుకున్న ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ జెపి గుప్తా ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించి 24 గంటల్లో రిపోర్ట్ చేయాలన్నారు. వివరాల్లోకి వెళితే 67 ఏళ్ల చాగన్ మక్వానాను జిల్లాలోని కోవిడ్ -19 ఆసుపత్రిలో చేర్పించగా, మే 13 న ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఈ నేపధ్యంలో అతని కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్లో ఉంచారు. మక్వానా సోదరుడు గోవింద్ మాట్లాడుతూ, బిఆర్టీఎస్ బస్టాండ్ వద్ద తన సోదరుని మృతదేహం పడివుందని, పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం తరలించారన్నారు. తాము క్వారంటైన్లో ఉన్నామని, తమ సోదరుడి మృతి గురించి తమకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ ఉదంతంపై స్థానిక బీజేపీ నేత గిరీష్ పర్మార్ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో ఈ కేసును ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశించారు.