ఇకపై 30 సెకెన్లలో కరోనా టెస్ట్... ఇజ్రాయెల్ టెక్నిక్కు ఢిల్లీలో ట్రయల్స్!
ABN , First Publish Date - 2020-08-01T13:27:51+05:30 IST
కరోనా వైరస్ టెస్టులను మరింత వేగవంతం చేయడానికి భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రత్యేక పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాయి. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ (ఆర్ఎంఎల్)లో...

న్యూఢిల్లీ: కరోనా వైరస్ టెస్టులను మరింత వేగవంతం చేయడానికి భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రత్యేక పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాయి. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ (ఆర్ఎంఎల్)లో దీనిపై ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇది సక్సెస్ అయితే కరోనా టెస్టుల రిజల్టును కేవలం 30 సెకన్లలో పొందవచ్చు. కరోనా వైరస్ను గుర్తించడానికి నాలుగు పద్ధతులను ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కనుగొనగా, వాటికి ఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇజ్రాయెల్, భారత్ సంయుక్తంగా నాలుగు వేర్వేరు సాంకేతిక పరిజ్ఞానాలను పరీక్షిస్తున్నాయి. వీటిలోని రెండు పరీక్షల్లో లాలాజల నమూనాలను పరిశీలించిన కొద్ది నిమిషాల్లోనే ఫలితాలను తెలుసుకోవచ్చు. మూడవ విధానంలో బాధితుని స్వరం ఆధారంగా వ్యాధిని గుర్తించవచ్చు. నాల్గవ విధానంలో శ్వాస నమూనాలోని రేడియో వేవ్ ద్వారా వైరస్ సోకిందా లేదా అనే అంశాన్ని కనుగొనవచ్చు. ఇజ్రాయెల్ రాయబారి రాన్ మల్కా.. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు.