ఢిల్లీ ఎయిర్పోర్టులో నెగిటివ్... స్వస్థలానికి రాగానే కరోనా పాజిటివ్!
ABN , First Publish Date - 2020-03-16T17:10:51+05:30 IST
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ఒడిశాలో ఒక పాజిటివ్ కేసు నమోదయ్యింది. ఇటలీ నుంచి ఒడిశాకు తిరిగి వచ్చిన ఒక యువకునికి వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే...
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ఒడిశాలో ఒక పాజిటివ్ కేసు నమోదయ్యింది. ఇటలీ నుంచి ఒడిశాకు తిరిగి వచ్చిన ఒక యువకునికి వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఆ యువకుడిని భువనేశ్వర్లోని ఆసుపత్రికి తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇటలీ నుంచి భారత్కు వచ్చిన ఆ యువకుడిని వైద్యుల పర్యవేక్షణలో కొద్ది రోజులు ఉంచారు. అతనిలో కరోనా వైరస్ లక్షణాలేమీ కనిపించలేదు. దీంతో అతనిని... అతని స్వస్థలమైన భువనేశ్వర్కు పంపించివేశారు. ఈ నేపధ్యంలో ఆ యువకుడు రైలులో ఈ నెల 12న భువనేశ్వర్ చేరుకున్నాడు. 14న ఆ యువకుడు మరోమారు వైద్య పరీక్షలకు వెళ్లగా, మెడికల్ రిపోర్టులో కరోనా పాజిటివ్ అని వెల్లడయ్యింది. దీంతో ఒడిశా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయ్యింది. ఆ యువకుడు ఇటీవల ఎవరెవరిని కలిశాడనే వివరాలతో పాటు అతడు తిరిగిన ప్రాంతాల గురించిన సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు.