టీకాకు ముందుగానే కరోనా ఔషధం... పరీక్షల్లో విజయవంతం!
ABN , First Publish Date - 2020-11-03T14:17:49+05:30 IST
కరోనా టీకా కంటే ముందుగానే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్...
న్యూఢిల్లీ: కరోనా టీకా కంటే ముందుగానే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) నుంచి ఔషధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎండబ్ల్యు పేరుతో వచ్చే ఈ ఔషధం రెండు దశల క్లినికల్ ట్రయల్స్ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ ఔషధానికి సంబంధించిన మూడవ దశ హ్యూమన్ ట్రయల్స్కు కూడా అనుమతి లభించింది.
ఈ సందర్భంగా సీఎస్ఐఆర్కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ విశ్వకర్మ మాట్లాడుతూ ఈ ఔషధానికి సంబంధించి నిర్వహించిన రెండు దశల ట్రయల్స్లో ఆశాజనక ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మూడవ దశ ట్రయల్స్కు అనుమతి మంజూరయ్యింది. త్వరలోనే దేశంలోని 300 మందిపై ఈ ఔషధానికి సంబంధించిన ప్రయోగాలు చేపట్టనున్నామని తెలిపారు. ఎయిమ్స్, అపోలోతో పాటు ఎన్నిక చేసిన పలు ఆసుపత్రులలో ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ మూడవ దశ ప్రయోగాలు విజయవంతమైతే వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ ఔషధం విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ ఔషధం ఇమ్యూన్ థెరపీ రూపంలో పనిచేయనుందని, దీనిని వ్యాధి బారిన పడిన వ్యక్తి తోపాటు ఆరోగ్యవంతుడైన వ్యక్తికి కూడా ఇవ్వవచ్చునన్నారు. తద్వారా వారు కరోనాకు గురికాకుండా ఉంటారని పేర్కొన్నారు. ఈ ఔషధం రెండవ దశ పరీక్షల్లో దీనిని తీసుకున్న కరోనా బాధితులు త్వరగా కోలుకోవడాన్ని గమనించామని, అలాగే ఈ ఔషధం వలన శరీరంలో వైరస్ లోడు వేగంగా తగ్గడాన్ని గుర్తించామన్నారు.