కరోనా వైరస్ మనల్ని భయపెడుతోంది...కేంద్రమంత్రి వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-06-25T14:08:29+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తిపై కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్ అంగడి సంచలన వ్యాఖ్యలు చేశారు....

బెలగావి (కర్ణాటక) : కరోనా వైరస్ వ్యాప్తిపై కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్ అంగడి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ మనల్ని భయపెట్టడానికి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను రేపేందుకు సృష్టించబడిందని కేంద్ర సహాయమంత్రి సురేష్ అంగడి వ్యాఖ్యానించారు. ‘‘ప్రతీ ఒక్కరూ కరోనా వైరస్తో జీవించడం నేర్చుకోవాలని, ఈ వైరస్ను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని నిబంధనలను పాటించాలి’’ అని మంత్రి సురేష్ సూచించారు.‘‘కరోనావైరస్ ఎవరు సృష్టించారో మనందరికీ తెలుసు. ఇది మనల్ని భయపెట్టడానికి,సరిహద్దులో ఉద్రిక్తతలను రేపడానికి సృష్టించబడింది, ఇది ఎవరు చేశారో మాకు తెలుసు. కరోనా వైరస్తో జీవించడం నేర్చుకోవాలి. మనం భయపడాల్సిన అవసరం లేదు. సామాజిక దూరాన్ని కొనసాగించాలి, అన్ని పారిశుద్ధ్య నిబంధనలను పాటించాలి’’ అని కేంద్రసహాయమంత్రి సురేష్ అంగడి బెల్గావీలో విలేకరులతో వ్యాఖ్యానించారు. కర్ణాటక రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 397 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 10,118కి పెరిగింది.