కరోనా కేసులతో దడ పుట్టిస్తున్న ఆ ఐదు రాష్ట్రాలు!
ABN , First Publish Date - 2020-08-01T15:57:19+05:30 IST
దేశంలోని ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, ఒడిశా, కేరళలలో కోవిడ్ -19 కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో వైద్య సదుపాయాలు సక్రమంగా లేవని, బాధితులకు తగినంతగా పడకలు...
![కరోనా కేసులతో దడ పుట్టిస్తున్న ఆ ఐదు రాష్ట్రాలు!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020080106280445/08012020102651n97.gif)
న్యూఢిల్లీ: దేశంలోని ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, ఒడిశా, కేరళలలో కోవిడ్ -19 కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో వైద్య సదుపాయాలు సక్రమంగా లేవని, బాధితులకు తగినంతగా పడకలు లేవనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు 10 వేలకుపైగా కేసులు నమోదైన 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఇవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రోజువారీ కేసుల వృద్ధి రేటు 9.3 శాతం కాగా, బీహార్లో ఇది 6.1 శాతం, కర్ణాటక, ఒడిశా కేరళలలో 5 శాతానికి మించి కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో లక్ష జనాభాకు 145 పడకలు అందుబాటులో ఉండగా, కేరళలో 254 పడకలు అందుబాటులో ఉన్నాయి. లక్ష జనాభాకు కర్ణాటకలో 392 పడకలు ఉన్నాయి. బీహార్లో లక్ష జనాభాకు 26 పడకలు, ఒడిశాలో 56 పడకలు మాత్రమే ఉన్నాయి. లక్ష జనాభాకు పడకల సగటు దేశవ్యాప్తంగా 137.6 శాతంగా ఉంది. బీహార్, ఒడిశాలలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలో పరీక్షలు జరుగుతుండగా, కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో జాతీయ సగటుకంటే తక్కువ పరీక్షలు జరుగుతున్నాయి. బీహార్ అతి తక్కువ పరీక్షల రేటు ఉంది. ఇక్కడ ప్రతి వెయ్యిమందిలో నలుగురికే పరీక్షలు జరుగుతున్నాయి.