విద్యాసంస్థలు, కార్యాలయాలు బంద్... మరి ఇంట్లో ఎలా ఉండాలంటే...
ABN , First Publish Date - 2020-03-16T17:43:47+05:30 IST
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపధ్యంలో పలు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు, కాలేజీలకు ఈనెల 31 వరకూ సెలవులు ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఇంట్లోనే ఉంటూ, అప్రమత్తంగా...
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపధ్యంలో పలు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు, కాలేజీలకు ఈనెల 31 వరకూ సెలవులు ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఇంట్లోనే ఉంటూ, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇన్ఫెక్టెడ్ ప్రాంతాల్లోని ప్రజలు 14 రోజుల పాటు ఇంటిలోనే ఉండాలని సూచిస్తున్నారు. ఈ విధంగా సెల్ఫ్ కోరంటైన్ స్థితిలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సివుంటుంది. ఇంట్లోనే ఉంటూ బయటి నుంచి ఆహారం తెప్పించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నవారు తమ లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే నిర్వహించడం ఉత్తమం. ఇటువంటి సందర్భాల్లో ఆహారాన్ని తీసుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడంతో పాటు గ్లౌజులను ధరించాలని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించగానే సంబంధిత వ్యక్తి విడిగా వేరే గదిలో ఉండటంతో పాటు వారు వినియోగించే దుస్తులు, వస్తువులను కుటుంబసభ్యులెవరూ తాకకుండా చూసుకోవాలి. ఇంట్లోనూ మాస్క్ పెట్టుకుంటుంటే అది డిస్ఇన్ఫెక్టెడ్గా ఉండేలా చూసుకోవాలి. మాస్క్ పాడయిన తరువాత దానిని కాల్చివేయాలి. కాగా ఆరేడు గంటలకు మించి మాస్క్లను పెట్టుకోకూడదు. ఒక కుటుంబంలోని ఎవరికైనా కరోనా సోకిందని నిర్ధారణ అయితే, ఆ ఫ్యామిలీలోని పిల్లలు, వృద్ధులు, గర్భిణులను తప్పనిసరిగా వారికి వీలైనంత దూరంగా ఉంచాలి.